జోషీమఠ్‌లో కానరాని ప్రచారం.. కారణమిదేనా? | Uttarakhand Joshimath Parties Candidate did Not Campaign | Sakshi
Sakshi News home page

Joshimath: జోషీమఠ్‌లో కానరాని ప్రచారం.. కారణమిదేనా?

Apr 10 2024 10:04 AM | Updated on Apr 10 2024 10:04 AM

Uttarakhand Joshimath Parties Candidate did Not Campaign - Sakshi

ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌ పేరు వినగానే గతంలో అక్కడ చోటుచేసుకున్న భూమి కుంగుబాటు ఉదంతం గుర్తుకు వస్తుంది. ఇంతకుమునుపు ఈ ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నేతలు ఈసారి ఈ సమీప ఛాయలకు కూడా రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు శరవేగంగా ప్రచారం సాగిస్తున్నాయి. నేతలు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌, చమోలి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం కనిపించడం లేదు. రాజకీయ నేతలు ఈ ప్రాంతానికి దూరంగా ఉంటున్నారు. ఉత్తరాఖండ్‌లోని పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో జోషీమఠ్‌, దసౌలి డెవలప్‌మెంట్ బ్లాకులో భూమి కుంగిన దరిమిలా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజలు తమను ప్రశ్నిస్తారనే భయంతో ప్రచారానికి నేతలు వెళ్లడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

జోషీమఠ్‌కు చెందిన బీజేపీ నేతలు కూడా ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహించకపోవడం విశేషం. కాగా లోక్‌సభ ఎన్నికల మొదటి దశలో అంటే ఏప్రిల్ 19న ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్, గర్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధమ్ సింగ్, హరిద్వార్ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement