
కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని.. ఎమ్మార్వో అయినా, ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.
‘‘కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేత కాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది?. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది’’ అని మహేష్ గౌడ్ చెప్పారు.
అసెంబ్లీలో జగదీశ్వర్రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్పై వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతి పని చేసింది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు’’ అంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.
‘‘నిరంతరం పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేం తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోం’’ అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు.