గవర్నర్‌పై కోర్టుకెక్కిన తమిళనాడు సర్కార్‌ | Tamil Nadu Accuses Governor Of Undermining Will Of People Goes To Court | Sakshi
Sakshi News home page

ముదురుతున్న విభేదాలు: గవర్నర్‌పై కోర్టుకెక్కిన డీఎంకే సర్కార్‌

Oct 31 2023 11:03 AM | Updated on Oct 31 2023 11:36 AM

Tamil Nadu Accuses Governor Of Undermining Will Of People Goes To Court - Sakshi

గవర్నర్‌పై కోర్టుకు ఎక్కింది తమిళనాడు ప్రభుత్వం. 

చెన్నై/ఢిల్లీ: తమిళనాడు అధికార  డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య  కొనసాగుతున్న విభేదాలు తారాస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. క్లియరెన్స్ కోసం పంపిన బిల్లుల ఆమోదాన్ని ఉద్దేశపూర్వకంగానే గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి జాప్యం చేస్తున్నారనిఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిర్దిష్ట గడువులోగా బిల్లులను  ఆమోదించేలా  లేదా పరిష్కరించేలా గవర్నర్‌ను ఆదేశించాలని ప్రభుత్వం కోర్టును కోరింది.  అలా గత కొన్ని నెలలుగా సాగుతున్న మాటల యుద్ధం ఇపుడు కోర్టుకు చేరింది. 

రాష్ట్ర అసెంబ్లీ పంపుతున్న బిల్లులు, ఉత్తర్వులను గవర్నర్  రవి  కావాలనే అడ్డుకుంటున్నారని, సకాలంలో ఆమోదించడం లేదని ప్రభుత్వం ఆరోపించింది.  54 మంది ఖైదీల ముందస్తు విడుదలకు సంబంధించిన పన్నెండు బిల్లులు, నాలుగు ప్రాసిక్యూషన్ ఆంక్షలు, ఫైళ్లు ప్రస్తుతం గవర్నర్ ముందు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజల అభీష్టాన్ని దెబ్బతీస్తూ  రాజ్యాంగ అధికారాన్ని   గవర్నర్‌ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడింది.  

కాగా తమిళనాడు పేరును ‘తమిళగం’ అని మార్చాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన ఈ ఏడాది జనరిలో చేసిన వ్యాఖ్యలు తమిళనాట ప్రకంపనలు రేపాయి. అది మొదలు  ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌కి మధ్య విభేదాలు  రగులుతూ ఉన్నాయి  పాలనా వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడమేంటని ప్రభుత్వం  గట్టిగా ప్రశ్నిస్తోంది. అటు గవర్నర్ కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కుల మేరకు తన బాధ్యతలు నిర్వర్తించే అధికారం ఉందని వాదించారు.ఈ పరిణామాల నేపథ్యంలో  ఒక సమయంలో అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్ చేసిన ఘటన సంచలనమైంది. 

Advertisement
 
Advertisement
Advertisement