ఇప్పుడు పార్టీ మారతారా?  | Sakshi
Sakshi News home page

ఇప్పుడు పార్టీ మారతారా? 

Published Sat, Oct 14 2023 2:57 AM

Revanth Reddy Comments On Ponnala Lakshmaiah Resignation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్యపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. 40 ఏళ్లు కాంగ్రెస్‌ పార్టీలో పదవులు అనుభవించి... చచ్చే ముందు పార్టీ మారడానికి సిగ్గుండాలని విమర్శించారు. 2014లో టీపీసీసీ అధ్యక్షుడిగా ఓసారి, 2018లో రెండోసారి టికెట్‌ ఇస్తే ఓడిపోయిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రంలో పొన్నాల లక్ష్మయ్యను ఎవరైనా గుర్తుపడుతున్నారంటే అది కాంగ్రెస్‌ పార్టీ ద యేనని రేవంత్‌ పేర్కొన్నారు. ఇంతకాలం పెంచి పోషించిన తల్లిలాంటి పార్టీని దూషించి పక్క పార్టీలోకి పోవడానికి ఏం రోగం..? అని  వ్యాఖ్యానించారు.  

పార్టీని పలుచన చేసేందుకే రాజీనామా
శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో డి.శ్రీనివాస్, కేశవరావు, బొత్స సత్యనారాయణ పార్టీని వదిలి వెళ్లారని.. వెళ్లే వారు వెళ్తూనే ఉంటారని అన్నారు. కానీ పొన్నాల విషయానికి వస్తే అసలు 80 ఏళ్ల వయస్సులో పార్టీ మారడమే బుద్ధిలేని పని అని ఎద్దేవా చేశారు. ఈ వయసులో నూ ఇంకా కుర్చీ పట్టుకుని వేలాడి.. టికెట్‌ కావా లని తిరిగారని విమర్శించారు.

జనగాం నియోజకవర్గానికి సంబంధించి ప్యానెల్‌లో రెండు పేర్లు వెళ్లాయని.. ఇంకా ఎలాంటి నిర్ణయం జరగలేదని స్పష్టం చేశారు. అసలు ఏ కారణం చెప్పి పొన్నాల పార్టీకి రాజీనామా చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ కు రాజీనామా చేసిన పొన్నాల ఏ పార్టీలోకి వెళ్తారో తనకు తెలీదని.. కానీ పార్టీని ఈ సందర్భంలో వీడి వెళ్లడమే అతి పెద్ద నేరం అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలకు క్షమాపణ చెప్పి రాజీనామా ఉపసంహరించుకుంటే గౌరవం ఉంటుందన్నారు.  

కేసీఆర్‌ ప్రైవేట్‌ సైన్యం
ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిటైర్డ్‌ అధికారులను ప్రైవేట్‌ సైన్యంగా మార్చుకుని ఎన్నికల అక్రమాలకు పాల్ప డుతున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర డీజీపీ, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రభాకర్‌రావు, వేణుగోపాల్‌ రా వు, నర్సింగరావు, భుజంగరావు తదితరులు ప్రైవే ట్‌ సైన్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆర్థిక శాఖ అధికారి రామకృష్ణారావు నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్‌ చెప్పినవారికి నిధులు విడుదల చేస్తున్నారని విమర్శించారు.

ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌ భూముల వినియోగ మార్పు చేశారని... వీళ్లందరిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తామన్నారు. ఎన్నికల అధికారులు స్పందించకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.  

కాంగ్రెస్‌ పద్ధతులు కేటీఆర్‌కు ఏం తెలుసు..? 
రేవంత్‌ పైసలు తీసుకుంటున్నాడని మంత్రి కేటీఆర్‌ అంటే సరిపోతుందా..? అని ప్రశ్నించారు. అమెరికాలో బాత్రూంలు కడిగేవాడికి కాంగ్రెస్‌ పద్ధతులు తెలియవు అని విమర్శించారు. రేవంత్‌ నిర్ణయంతో టికెట్లు ఖరారు కావని, ప్రక్రియ ప్రకారమే అభ్య ర్థుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు.

బీసీలకు బీఆర్‌ఎస్‌ కంటే ఎక్కువ సీట్లే ఇస్తాం
75 మంది కాంగ్రెస్‌ పార్టీ శ్రేయోభిలాషుల జాబితాను కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు అందించారని... వారి పై నిఘా పెట్టి బెదిరించే పనులను కేంద్రంలో ఉన్న దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ చేస్తోందని రేవంత్‌ ఆరోపించారు. బీసీలకు 34 సీట్లు ఇవ్వాలన్న తాపత్రయం కాంగ్రెస్‌ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం లెఫ్ట్‌ పార్టీలతో భట్టి విక్రమార్క చర్చలు జరుపుతున్నారన్నారు. 119 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాలని అనుకుంటున్నామని.. చారి్మనార్‌ అసెంబ్లీ స్థానంలో అలీ మస్కత్‌ను పోటీ చేయాలని పార్టీ అధిష్టానం కోరిందన్నారు.

Advertisement
Advertisement