సాక్షి, తాడేపల్లి: అక్రమాలను ప్రశ్నిస్తుంటే చంద్రబాబు సర్కార్కు భయం పట్టుకుందని.. అందుకే ప్రశ్నించే గొంతులను నులుముతున్నారంటూ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అనధికార సెన్సార్ షిప్ దుర్మార్గం అన్నారు. సోషల్ మీడియా ఖాతాలను లేపేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లను తొలగించారు. సాక్షి టీవీ, బిగ్ టీవీ ఖాతాలను కూడా లేపేశారు. ప్రశ్నించే గొంతులను చూసి చంద్రబాబుకు ఎందుకంత భయం?’’ అంటూ శివశంకర్ ప్రశ్నించారు.
డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తే నేరమా?. అందులో అబద్దాలు ఉంటే ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కానీ సోషల్ మీడియా, టీవీ ఛానళ్ల ఎక్కౌంట్లపై దాడి ఎందుకు?. తప్పులను కప్పి పుచ్చుకోవటానికే సోషల్ మీడియా ఖాతాలపై దాడి చేస్తున్నారు. ఇదే కొనసాగితే సోషల్ మీడియా వార్ తప్పదు. డీఎస్సీలో అక్రమాలకు మంత్రి లోకేష్ బాధ్యత వహించాలి. పదవికి రాజీనామా చేసి సీబీఐతో విచారణ జరపాలి. సోషల్ మీడియా అకౌంట్లపై దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం. న్యాయ పోరాటం చేసి మళ్ళీ ఆ అక్కౌంట్లను సాధిస్తాం’’ అని శివశంకర్ అన్నారు.


