చిన్నారులకు రిన్ సబ్బుతో వైద్యం చేస్తున్న తీరును ప్రశ్నిస్తున్న డాక్టర్ శ్రీకాంత్
అమలాపురం టౌన్: అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు పిచ్చి కుక్క దాడిలో గాయపడి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని అమలాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ శనివారం పార్టీ నాయకులతో కలసి వచ్చి పరామర్శించారు. ఆ సమయంలో పిచ్చి కుక్క కరిచిన పిల్లల గాయాలకు హైడ్రోజన్ ఫైరాక్సైడ్, స్పిరిట్, బెటాడిన్, నార్మల్ సైలన్ వంటి వాటితో కాకుండా సరైన వైద్య విధానాలు పాటించకుండా చికిత్స చేస్తున్న తీరను చూసి డాక్టర్ శ్రీకాంత్ వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గాయాలను దుస్తులు ఉతికే రిన్ సబ్బుతో శుభ్రపరిచే విధానాన్ని ఆయన తప్పు పట్టారు. కుక్క కరిచిన బాధిత చిన్నారుల విషయంలో జరుగుతున్న నిర్లక్ష్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య నిబంధనల ప్రకారం బాధితులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందించాలని శ్రీకాంత్ డిమాండ్ చేశారు. చిన్నారుల ఆరోగ్యంతో చెలగాటం ఆడడంపై ఆయన మండిపడ్డారు. చిన్నారులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతుంటే స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుకు పట్టదా...? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రిన్ సబ్బుతో వైద్యం చేస్తున్న తీరును, వైద్యులు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని డాక్టర్ శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు.


