సాక్షి, విశాఖపట్నం: ఏపీలో డీఎస్సీ అక్రమాల డొంక కదులుతోంది. టెట్ అర్హత లేకుండా టీచర్ ఉద్యోగాలు.. డీఎస్సీ కుంభకోణం బద్దలవుతోంది. వరుస అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖలో ఒకే కుటుంబంలో ఇద్దరికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెట్ అర్హత లేకుండానే ఉద్యోగాలు ఇచ్చినట్టు తేలింది.
టెట్ పాస్ కాకుండానే టీచర్ ఉద్యోగం పొందిన చిల్లా యోగీశ్వరరావు.. అతని చెల్లి మోహిని దేవికి కూడా స్పోర్ట్స్ కోటాలో టీచర్ పోస్ట్ వచ్చింది. టెట్ సెర్టిఫికెట్ పెట్టకపోయినా యోగీశ్వరరావుకి ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చేశారు. టెట్ అర్హత రావాలంటే 75 మార్కులు రావాలి.. మూడుసార్లు టెట్ రాసినా 75 మార్కులు రాలేదు. అయినా చంద్రబాబు సర్కార్ ఉద్యోగం ఇచ్చేసింది.
కాగా, స్పోర్ట్స్ కోటా పేరుతో నచ్చినోళ్లకు నకిలీ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేసిన కుంభకోణం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఎక్కడో ఒకచోట నకిలీ సర్టిఫికెట్ బయటపడుతోంది.. మరోచోట వేరొకరి ధ్రువపత్రంతో ఉద్యోగం కొట్టేశారన్న ఫిర్యాదు వస్తోంది.. ఇంకొకచోట గడువు ముగిసిన తర్వాత సర్టిఫికెట్ మార్చుకునే అవకాశం ఎలా వచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది.
మరొక వ్యవహారంలో గుర్తింపు లేని క్రీడా సంఘం ధ్రువపత్రాలతోనే కొలువులు దక్కాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే నియామక ప్రక్రియలో ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన వర్తించినట్లుగా కనిపిస్తుండటమే ఇప్పుడు అసలు అనుమానాలకు తావిస్తోంది. మెరిట్లో ముందున్నవారికి అన్యాయం జరిగిందన్న ఆరోపణల నుంచి.. అనుమానాస్పద సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వ్యవహారాల వరకు.. ఒక్కొక్కటిగా బయటకొస్తున్న ఉదంతాలు మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియలో జరిగిన అక్రమాలను బయటపెడుతున్నాయి.
ఇదీ చదవండి: ఆట దగా.. ‘కోటా’ దగా!


