స్మృతి ఇరానీ Vs ప్రియాంక.. యూపీలో ఆసక్తికర సమరం! | Priyanka Gandhi Will Contest In Amethi Lok Sabha Constituency | Sakshi
Sakshi News home page

స్మృతి ఇరానీ Vs ప్రియాంక.. యూపీలో ఆసక్తికర సమరం!

Apr 11 2024 11:59 AM | Updated on Apr 11 2024 12:18 PM

Priyanka Gandhi Will Contest In Amethi Lok Sabha Constituency - Sakshi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో టికెట్ల కేటాయింపు అంశంలో ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది తేలియాల్సి ఉంది. కాగా, ముందు నుంచి ఈ స్థానంలో రాబ‍ర్ట్‌ వాద్రా పోటీ ఉంటారనే వార్తలు వినిపించినప్పటికీ అది జరగపోవచ్చు అని సమాచారం.

కాగా, గాంధీ కుటుంబంతో విడదీయరాని బంధం ఉన్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారనే అంశం కాంగ్రెస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే ఆంటోని ఈ విషయంలో ఒక హింట్‌ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి గాంధీ కుటుంబ సభ్యులు బరిలో ఉంటారని వెల్లడించారు. కాగా, ఆంటోని బుధవారం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమేథీ, రాయబరేలీ సీట్లపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. యూపీ నుంచి గాంధీ కుటుంబమే పోటీ చేస్తారు. రాబర్ట్‌ వాద్రా అక్కడ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు అని కామెంట్స్‌ చేశారు. దీంతో,  ప్రియాంక లేదా రాహుల్‌ గాంధీ యూపీ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. రాహుల్‌ ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఇక, అమేథీలో బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఢీకొట్టేందుకు ప్రియాంకు బరిలోకి దింపుతారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ప్రియాంక కనుక అమేథీ నుంచి పోటీలో నిలిస్తే రాజకీయం ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు.. ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా అమేథీ స్థానం కాంగ్రెస్‌కు దక్కిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement