కాంగ్రెస్‌ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు! | Patnam Mahender Reddy To Join Congress Party Tomorrow | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ గూటికి పట్నం.. ముహూర్తం ఖరారు!

Feb 9 2024 10:48 AM | Updated on Feb 9 2024 12:04 PM

Patnam Mahender Reddy To Join In Congress Tomorrow - Sakshi

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార, వికారాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది.  దీనిలో భాగంగా వీరిద్దరూ రేపు(శనివారం) ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవనున్నారు. రేపు ఖర్గే సమక్షంలో మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు.

గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి శాలువా, బొకేలతో సన్మానించారు.మహేందర్‌రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. తాండూరు నియోజకవర్గంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తాటికొండ స్వప్న, సీనియర్‌ నాయకులు రవి గౌడ్, కరణం పురుషోత్తంరావ్‌ తదితరులు పట్నం వెంట వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 

ఎన్నికలకు ముందే వెళ్లాలని భావించినా..  
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్‌లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అప్పట్లో కేసీఆర్‌ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించటంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్‌ఎస్‌కు అంటీముట్టనట్లు ఉంటున్నారు. 

చేవెళ్ల ఎంపీ సీటు కమిట్‌మెంటుతోనే..? 
మరో నాలుగు నెలల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సమాచారం. కాగా, మహేందర్‌రెడ్డి సోదరుడు, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాత్రం తాను బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement