బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిజం రుజువైంది: ఆర్కే రోజా | No Animal Fat In TTD Laddu: Roja Slams Kutami Prabhutvam | Sakshi
Sakshi News home page

బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిజం రుజువైంది: ఆర్కే రోజా

Sep 19 2026 1:50 PM | Updated on Sep 19 2026 1:54 PM

No Animal Fat In TTD Laddu: Roja Slams Kutami Prabhutvam

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదన్న తాజా పరిణామాలపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్‌.కే. రోజా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. శ్రీవారి ప్రసాదాలు పరమ పవిత్రమైనవని పేర్కొంటూ.. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని ఆమె అన్నారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ నిజం మరోసారి నిర్ధారణ అయిందని రోజా పేర్కొన్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదాలకు కళంకం అంటగట్టే ప్రయత్నం చేసిన వారు ఇప్పటికైనా రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు ముగింపు పలకాలని అన్నారు. అలాగే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి హయాంలో కల్తీ జరిగిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారం కూడా ఇకనైనా ఆపాలని ఆమె అంటున్నారు.

‘‘పచ్చి పాలు లాంటి మనసు జగనన్నది. పచ్చి పాలలో కల్తీకి ఆస్కారం ఉండదు. జగనన్న పాలనలో కూడా కల్తీకి ఆస్కారం ఉండదు. అంతా పవిత్రమేనని బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల వేళ మరోసారి నిరూపితమైంది’’ అని ఆర్‌.కే. రోజా తన పోస్టులో పేర్కొన్నారు.

ప్రమాణాలకు అనుగుణంగా లేని నెయ్యి ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఉపయోగించినట్లు ఆధారం లేదు. అయినా లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని ఎలా ప్రకటించారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బ తీయడం కాదా? అని చంద్రబాబును ఉద్దేశించి మరో ట్వీట్‌లో రోజా ప్రశ్నించారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement