
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుగా నిలిచారు.ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణపై కవిత స్పందించారు.
కేటీఆర్ను ఏసీబీ విచారణపై కవిత మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం. చెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదు. మా పార్టీలో లోపాలు సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోం. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడి. మా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమేరైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసింది.
పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది.
మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ను విచారించింది. ఇప్పుడు కేటీఆర్ను ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని వాఖ్యానించారు.
