‘లోకేశ్‌.. పరీక్షలపై ఇంత నిర్లక్ష్యమా.. విద్యార్థికి ఏదైనా జరిగితే?’ | MLC Botsa Satyanarayana Serious On CBN Govt | Sakshi
Sakshi News home page

‘లోకేశ్‌.. పరీక్షలపై ఇంత నిర్లక్ష్యమా.. విద్యార్థికి ఏదైనా జరిగితే?’

May 31 2025 1:27 PM | Updated on May 31 2025 4:10 PM

MLC Botsa Satyanarayana Serious On CBN Govt
  •  ప్రజలను వంచించడానికి ఏడాది తరువాత మరో ప్రయత్నం
  • మహానాడు ద్వారా ప్రజలకు ఏం చెప్పారు?
  • ఏడాది పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు
  • సభ్యత మరిచి దారుణమైన భాషతో విమర్శలకు దిగారు
  • పదో తరగతి విద్యార్ధుల జీవితాలతో చెలగాటం
  • జవాబుపత్రాల మూల్యాంకనం ప్రక్రియను అపహాస్యం చేశారు
  • 20 మార్కులు వచ్చి ఫెయిలైన విద్యార్ధికి రీవాల్యుయేషన్‌లో 90 మార్కులు
  • ఇంత దారుణంగా జవాబుపత్రాలను దిద్దడం ఎప్పుడైనా చూశామా?
  • దీనికి బాధ్యులైన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు?
  • :నిలదీసిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్స్‌లా ముగిసిందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చేసిన మోసంను, ఏడాది పాలన తరువాత మరోసారి ఈ మహానాడు ద్వారా మోసం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏ చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 

ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, సభ్యత మరిచి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబుపత్రాలను కూడా సరైన విధంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్ళిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్దులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే....

కడపలో మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ పెద్ద డ్రామా ప్రదర్శించింది. కొత్త టెక్నిక్‌లతో లేనివి ఉన్నట్లుగా చూపించారు. ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, జిమ్మిక్కులతో ప్రజలను మభ్య పెట్టేందుకు మూడు రోజుల పాటు చాలా తాపత్రేయ పడ్డారు. ప్రతి రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినం సందర్భంగా కార్యక్రమాలు చేసుకోవడం సహజం. అధికారంలో ఉన్న పార్టీ తాను చేసిన పనులను చెప్పుకుంటుంది. కానీ టీడీపీ మాత్రం అధికారంలో ఉండి, ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేక, వైఎస్సార్‌సీపీని ఆడిపోసుకుని ఆత్మస్తుతి-పరనిందకే పరిమితమయ్యారు. స్థాయిలేని వ్యక్తులతో సభ్యత లేకుండా మాట్లాడిన భాషను మొత్తం రాష్ట్ర ప్రజానీకం అంతా చూశారు.

మహానాడు సాక్షిగా పథకాలపై ఎందుకు స్పష్టత ఇవ్వలేదు?
మహనాడు సాక్షిగా ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలను ఎప్పుడు, ఏ తేదీల్లో అమలు చేస్తామో ఎందుకు చెప్పలేక పోయారు? వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మేం ఏం చేశామో ఇప్పటికీ గట్టిగా చెప్పగలం.  వైఎస్‌ఆర్‌ జిల్లా పేరును వైఎస్‌ఆర్‌ కడప జిల్లాగా  మార్చుకున్నారు. గత ప్రభుత్వంలో ఎన్టీఆర్ జిల్లాగా విజయవాడ ప్రాంతంలో కొత్త జిల్లాను అప్పటి సీఎం వైఎస్‌ జగన్ ప్రకటించారు. మరి ఎన్టీఆర్‌ జిల్లాను కూడా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా కూటమి ప్రభుత్వం మారుస్తుందా? ఈ రాష్ట్రానికి సేవలు అందించిన ముఖ్యమంత్రులకు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇంత సంకుచితంగా సీఎం చంద్రబాబు ఎలా ఆలోచిస్తున్నారు?

పదోతరగతి జవాబుపత్రాల మూల్యాంకనంపై సమీక్ష ఏదీ?
పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్ధులు రీ వెరిఫికేషన్ పెట్టుకుంటే వారికి ఏకంగా తొంబై మార్కులు వచ్చాయి. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడైనా చూశామా? 16వేల మంది తమ పేపర్లను కరెక్షన్‌ చేయించుకుంటే దానిలో అధికశాతం అస్తవ్యస్తంగా పేపర్ల మూల్యాంకనం చేసినట్లుగా తేలింది. గతంలో ఏ నాడైనా అయిదు వేల కంటే ఎక్కువ మంది విద్యార్థులకి కరెక్షన్‌లో భిన్నంగా ఫలితాలు వచ్చాయా? మొదట ఇరవై మార్కులు వచ్చి, తరువాత రీవాల్యుయేషన్ తరువాత తొంబై మార్కులు వచ్చిన ఘటనలు ఎన్నడూ లేవు. 

దీనిని బట్టి చాలా దారుణంగా పదోతరగతి విద్యార్ధుల జవాబుపత్రాలను దిద్దారనేది అర్థమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పదోతరగతి పరీక్షల రీవాల్యుయేషన్‌పై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇందులో ఎటువంటి తప్పులు చేశారో కనీసం సమీక్ష అయినా చేసుకున్నారా? గతంలో రోజుకు నలబై జవాబుపత్రాలను ఒకొక్కరికి ఇచ్చేవారు. కానీ తాజాగా వాల్యుయేషన్‌ చేసిన వారికి రోజుకు ఎన్ని జవాబుపత్రాలను దిద్దాలని ఇచ్చారో బయటపెట్టాలి. విద్యాశాఖ అసమర్థత కారణంగా విద్యార్ధులు ఎంత క్షోభకు గురయ్యారో అర్థం చేసుకోవాలి. ఈ వ్యవహారానికి బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో బయటపెట్టాలి. ఈనాడు వంటి ఎల్లో మీడియా పత్రికల్లో ఈ వ్యవహారాన్ని వక్రీకరించేలా ఎందుకు కథనాలు రాయిస్తున్నారో చెప్పాలి.

మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ...
 ఉర్సాకు ఎంతకు భూములు ఇచ్చారో బయటపెట్టాలి. కారుచౌకగా కట్టబెడుతున్నారన్న మా ఆరోపణలను వాస్తవం కాదని దమ్ముంటే నిరూపించాలి.ఈ రోజు ఈనాడు పత్రికలో ఇరవై శాతం ఇలాగే రీవాల్యుయేషన్‌లో మార్కుల్లో తేడాలు రావడం సహజమన్నట్లుగా వచ్చిన కథనం పూర్తి అవాస్తవం. ఏ ఏడాది అయినా అయిదు వేల మంది కంటే ఎక్కువ విద్యార్ధులకు రీవాల్యుయేషన్‌లో మార్కుల్లో భారీ వ్యత్యాసాలు రాలేదు. ప్రతిఏటా కనీసం పద్నాలుగు రోజులు జవాబు పత్రాలను దిద్దేవారు. కానీ తాజాగా మాత్రం తొమ్మిది రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేశారు. జవాబు పత్రాలను దిద్దేవారిపై పనిఒత్తిడిని పెంచారు. వాల్యుయేషన్ సెంటర్లు, టీచర్లను పెంచకుండా ఎక్కువ జవాబుపత్రాలను దిద్దాలని ఇవ్వడం వల్లే ఇటువంటి ఫలితాలు వెలువడ్డాయి.

మహానాడులో రైతుభరోసా ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వంలోని వ్యవసాయశాఖ మంత్రి ఎందుకు ప్రకటించలేదు? అమ్మ ఒడి, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగభృతి ఇలా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారో తేదీలతో సహా ఎందుకు సంబంధిత మంత్రులు ఎందుకు వెల్లడించలేదు?

ఏడాది కూటమి పాలనలో ప్రజలకు జరిగిన మోసాన్ని ఎత్తి చూపుతూ జూన్ 4వ తేదీన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో 'వెన్నుపోటు దినం' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలను కలుపుకుని ఆరోజు నిరసనలు, ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నాం’ బొత్స తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement