
వరంగల్: మంత్రి కొండా సురేఖ భర్త మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేతగా ఉండి ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు నాయని. కొండా మురళి వ్యాఖ్యలపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని, బీసీ కార్డు అడ్డుపెట్టుకుని మాట్లాడతామనడం సరికాదన్నారు.
హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఈ సమావేశం అనంతరం రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘పార్టీ మంచి చెడులు చర్చించుకున్నాం. సీనియర్లు, అనుభవజ్ఞులు ఎక్కడ పడితే అక్కడ వివాదాస్పండగా మాట్లాడటం సరికాదు. బీసీ కార్డు అడ్డం పెట్టుకుని మాట్లాడతామనడం సరికాదు.
ఏదైనా సమస్య ఉంటే పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పటికైనా అధిష్టానం ఆలోచన చేయాలి. మనమే పార్టీకి నష్టం చేసుకుంటే ఎలా?, ఎమ్మెల్యేల అందరి నిర్ణయం మేరకు తదుపరి చర్యలుంటాయి. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం’ అని నాయని స్పష్టం చేశారు.
కొండా వ్యాఖ్యలపై కాంగ్రెస్లో ప్రకంపనలు
కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిల పై కొండా మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొండా వ్యాఖ్యలపై అధికార ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలోనే తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగానే రాజేందర్రెడ్డి నివాసంలో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. కొండా మురళిపై ఎమ్మెల్యేలంతా కలిసి నిర్ణయం తీసుకునే క్రమంలో ఆ సమావేశం ఏర్పాటు చేశారు.