
సాక్షి, వరంగల్: వరంగల్ కాంగ్రెస్లో వార్ ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ భర్త మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా ఆయన వార్నింగ్ ఇచ్చారు. కనుబొమ్మలు లేని నాయకుడు నాడు టీడీపీని భ్రష్టు పట్టించాడు. మొన్న కేటీఆర్ను వెన్నుపోటు పొడిచిండు. ఎన్కౌంటర్ల స్పెషలిస్ట్.. ఇప్పుడు కాంగ్రెస్లో చేరాడు. మీకు ఇజ్జత్ ఉంటే బయటి పార్టీ నుంచి వచ్చిన నాయకులు మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి’’ అంటూ కొండా మురళి వ్యాఖ్యానించారు.
వరంగల్ పోలీస్ కమిషనర్కు చెపుతున్నా.. మీ డిపార్ట్మెంట్లో కోవర్డులు ఉన్నారు. నాకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు కాదు.. పోలీస్ డిపార్ట్మెంట్లో కోవర్డులపై చర్యలు తీసుకోండి. కొండా మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరూ ఉండరు. పరకాలలో 75 ఏళ్ల వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎన్నికలకు ముందు మా వద్దకు వచ్చి కాళ్లు పట్టుకున్నాడు’’ అంటూ కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘‘పరకాల నియోజకవర్గంలో నా కూతురు కొండా సుస్మిత పటేల్ రంగప్రవేశం చేయనుంది. కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఆమె మంత్రి పదవి ఎక్కడికి పోదు’’ అని కొండా మురళి పేర్కొన్నారు.