
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. ఈరోజు(మంగళవాళం) బేగంపేట్ లో మీడియాతో మాట్లాడిన సీతక్క.. గత ప్రభుత్వం కొన్ని వర్గాలకే కొమ్ముకాసి రాష్ట్రాన్ని అప్పులు కుప్పుగా మార్చిందని మండిపడ్డారు. కేసీఆర్ అప్పు.. తెలంగాణ భవిష్యత్ కు ముప్పుగా దాపురించిందని ధ్వజమెత్తారు.
‘కేసీఆర్ నిర్వహాకం వల్ల నెలకు రూ. 6 వేల కోట్ల ప్రజాధనాన్ని అప్పుల చెల్లింపుల కోసం మళ్లించాల్సి వస్తుంది. సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అయితే.. పత్తా లేకుండా ఎక్కడికి వెళ్లారు. సత్తా ఉంటే అసెంబ్లీకి వచ్చి సత్తా నిరూపించుకోవాలి. ఉద్యోగుల పోరాటాన్ని వాడుకున్న చరిత్ర బీఆర్ఎస్ది. 40 మంది ఆర్టీసీ కార్మికుల ఉసురు తీసింది మీరు కాదా?, ఉపాద్యాయ, ఉద్యోగ నాయకుల ఇంటి తలుపులు పగుల గొట్టింది ఎవరు కేటీఆర్?.
ఎందరో ఉద్యమకారులను అవమాన పరిచి బయటకు పంపిన చరిత్ర మీది. అప్పులు, అమ్మకాలు తప్ప మీరు చేసిన అభివృద్ది శూన్యం. మీరు చేసిన అభివృద్ది ఒక గాలి బుడగ అని ఎన్నికల్లో ప్రజలే తేల్చారు. మీ అప్పుల మూలంగా ఎన్నో ఆర్దిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినా ఎక్కడా సంక్షేమానికి లోటు లేకుండా చూస్తున్నాం’ అని మంత్రి సీతక్క తెలిపారు.