సాక్షి, హైదరాబాద్: రైళ్లలో అన్రిజర్వ్డ్ కోచ్లలో టికెట్ బుకింగ్కు ఉద్దేశించిన యూటీఎస్(అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టం)యాప్ను రైల్వే బోర్డు రద్దు చేసింది. మార్చి 1 నుంచి ఇది పనిచేయదు. యూటీఎస్తోపాటు ఎన్టీఈఎస్, ఫుడ్ ఆన్ ట్రాక్, రైల్మదద్, ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ తదితర విడివిడి యాప్ల సేవలను ఒకే యాప్ ద్వారా అందించాలన్న ఉద్దేశంతో రైల్వే శాఖ కొత్తగా రైల్ వన్ యాప్ను రూపొందించడం తెలిసిందే. ఈ ఒక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని అన్ని రకాల సేవలను పొందే అవకాశం కల్పించింది.
కానీ, ఇప్పటికీ యూటీఎస్ యాప్ కొనసాగడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో, ఆ యాప్ను పూర్తిగా నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయించి మార్చి 1 వరకు గడువు ఇచ్చింది. సీజన్ టికెట్ బుకింగ్, రెన్యువల్, కొత్త యూజర్ రిజిస్ట్రేషన్, ఆర్ వాలెట్ టాప్అప్, ప్లాట్ఫాం టికెట్ బుకింగ్ సేవలను ఈ యాప్లో ఇప్పటికే ఉపసంహరించారు. మిగిలిన సేవలను మార్చి 1 నుంచి నిలిపివేయనున్నారు. ఆ తర్వాత ఆ యాప్ పూర్తిగా పనిచేయదు.
ఈ యాప్ను వాడే అలవాటు ఉన్న వారు ప్లే స్టోర్ నుంచి రైల్ వన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని.. కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా యూటీఎస్ యాప్ లేదా ఐఆర్సీటీసీ లాగిన్తోనే సైన్ఇన్ కావచ్చని రైల్వే అధికారులు సూచించారు. రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్, ప్లాట్ఫాం టికెట్ బుకింగ్, రిఫండ్, ఫుడ్ ఆర్డర్, పీఎన్ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్, ఫిర్యాదులు (రైల్మదద్).. ఇలా అన్ని సేవలను దాని నుంచి పొందవచ్చని వివరించారు.


