చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్‌: మంత్రి కారుమూరి | Minister Karumuri Nageswara Rao Slams Chandrababu Naidu Over His Comments On Farmers - Sakshi
Sakshi News home page

చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటీషియన్‌: మంత్రి కారుమూరి

Jan 8 2024 6:17 PM | Updated on Jan 8 2024 7:51 PM

Minister Karumuri Nageswara Rao Slams Chandrababu - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవుట్‌ డేటెట్‌ రాజకీయ నాయకుడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. చంద్రబాబు రైతుల గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ఆచంటలో చంద్రబాబు సమావేశానికి తన పుట్టినరోజుకి వచ్చిన జనాలు కూడా రాలేదని దుయ్యబట్టారు, గతంలో తణుకులో చంద్రబాబు నిర్వహించిన రైతు పోరుబాటలోకు 400 మంది జనం కూడా రాలేదని, బహిరంగ సభకి 1500 మంది జనం కూడా  రాలేదని అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలంలో మంత్రి కారుమూరి సోమవారం మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబుకు ధాన్యం గురించి, సంచుల గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులకు ధాన్యం సంచులు ఒక కోటి 14 లక్షల గన్ని బ్యాగ్‌లను అందజేశామని తెలిపారు. టార్గెట్ కంటే మించి 10 లక్షల సంచులు అదనంగా ఇచ్చామని పేర్కొన్నారు.

బాబు హయాంలో  17 లక్షల 94 వేల మంది రైతుల నుంచి 2 కోట్ల 65 లక్షలు టన్నులు ధాన్యం మాత్రమే సేకరించారని..  తమ ప్రభుత్వంలో 36 లక్షల 60 వేల మంది రైతుల నుంచి 3 కోట్ల 33 లక్షల 86 మెట్రిక్‌లు ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని అన్నారు. బాబు హయాంలో దళారుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి రైతులు నడ్డి విరిచారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మేలు చేశామని తెలిపారు. మొన్న మిచాంగ్ తుఫాన్లో  తడిసిన, మొక్క వచ్చిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేశామని అన్నారు.  

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డివి స్కీములు అయితే.. చంద్రబాబువి అన్ని స్కాములేనని ధ్వజమెత్తారు. తాను చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ప్రతి అవ్వా, తాత మొహంలో చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement