కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం పురోగతి | Minister Harish Rao Celebrates Bathukamma in Siddipet | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం పురోగతి

Oct 23 2023 3:24 AM | Updated on Oct 23 2023 3:24 AM

Minister Harish Rao Celebrates Bathukamma in Siddipet - Sakshi

మహిళలతో సెల్ఫీ దిగుతున్న మంత్రి హరీశ్‌రావు 

ప్రశాంత్‌నగర్‌ (సిద్దిపేట): ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు సాగుతోందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో మంత్రి హరీశ్‌రావు దంపతులు సద్దుల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కోమటి చెరువువద్ద మంత్రితో మహిళలు, యువతులు సెల్పిలు, ఫొటోలు దిగడానికి పోటీపడ్డారు. మహిళలు తీసుకువచ్చిన ఫలహారాలు తింటూ మంత్రి వారితో ముచ్చటించారు.

అనంతరం మాట్లాడుతూ ఎండాకాలాన్ని వానా కాలంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు కాళేశ్వరం జలాలతో నిండు కుండల్లా మారాయన్నారు. సమైక్య రాష్ట్రంలో కరెంటు లేక ఇబ్బందులు పడ్డామని, నేడు నీరు, విద్యుత్‌ సరఫరా నిరంతరం జరుగుతోందని అన్నారు. మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.

ప్రజలందరూ బతుకమ్మ పండుగ చేసుకున్న విధంగానే దసరాను కూడా వైభవంగా నిర్వహించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు బీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు జువ్వన కనకరాజు ఆధ్వర్యంలో తయారు చేసిన భారీ బతుకమ్మను మంత్రి హరీశ్‌రావు తిలకించారు.

Advertisement
 
Advertisement
Advertisement