సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్కు రెండేళ్ల కాలంలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు.. దీనిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా రేవంత్ అని సవాల్ విసిరారు. దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోకండి అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కార్నర్ మీటింగ్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ..‘కరీంనగర్కు రూ.1400 కోట్లు విడుదల చేశానని రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోక్. రెండేళ్ల పాలనలో కరీంనగర్కు నయాపైసా కూడా ఇవ్వలేదు. నన్ను కోసినా నయాపైసా లేదని చెప్పిన రేవంత్ రెడ్డి ఎన్నికలు వస్తున్నాయని అబద్దాలు చెబుతున్నారు. దొంగ మాటలతో కొంపలు ముంచే సీఎం మాటలు నమ్మి మోసపోకండి. సీఎంకు రోషం, పౌరుషం చచ్చిపోయిందని ఒప్పుకుంటారా?.
కేసీఆర్ పంపే మూటలను ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా?. అందుకే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటారా?. మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం. మున్సిపల్ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్నులు, నల్లా ఛార్జీలు పెంపు తథ్యం. పొరపాటున కాంగ్రెస్ను గెలిపిస్తే.. రోడ్డుపై నడిస్తే కూడా పన్ను వేస్తారు జాగ్రత్త. కమలం లక్ష్మీ అమ్మవారి పువ్వు.. స్వస్తిక్ శుభసూచికం. బ్యాలెట్లో పువ్వుపై స్వస్తిక్ గుర్తు గుద్దితే అన్నీ శుభ సూచకాలే అంటూ వ్యాఖ్యలు చేశారు.


