సాక్షి, హైదరాబాద్: చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయ రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే, విజయ కుటుంబం మృతి మిస్టరీపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా పోలీసులు.. విజయ భర్తను ఇప్పటికే పలుమార్లు ప్రశ్నించారు. కానీ, వారి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు.
చర్లపల్లి ఐటీ ఉద్యోగి విజయ(విజయశాంతి రెడ్డి) కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఆత్మహత్య చేసుకునే రోజు.. కొడుకు, కూతురిలో సహా కారులో విజయ రెడ్డి చర్లపల్లి రైల్వేస్టేషన్కు వెళ్లింది. రైల్వే స్టేషన్కు వెళ్లిన తర్వాత తాము ఫంక్షన్ వచ్చినట్టు తల్లికి ఫోన్ చేసి చెప్పింది. చనిపోయేందుకు ముందు రోజే కూతురిని హాస్టల్ నుంచి ఇంటి తీసుకువచ్చిన విజయ. ముగ్గురూ రైల్వే స్టేషన్లో ప్రశాంతంగా మాట్లాడుతూ తిరిగినట్టు సీపీ టీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రైలు పట్టాల మధ్యలో నుంచి నడుచుకుంటూ విజయ, పిల్లలు వెళ్లారు. ఈ క్రమంలో వారిని రైలు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
అయితే, పిల్లలను రైల్వేస్టేషన్కు ఏమని చెప్పి తీసుకువచ్చారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇలా చనిపోవడానికి సిద్దమై ముగ్గురు వచ్చారా? లేక తల్లి విజయే బలవంతంగా తీసుకువచ్చిందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిసింది. ఆర్థిక ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. మరోవైపు.. తన ఉద్యోగం ద్వారా విజయకు లక్ష రూపాయల జీతం వస్తోంది. ఇంటి అద్దెల ద్వారా మరికొంత ఆదాయం వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న భర్త జీతం కూడా విజయ అకౌంట్లో జమ అవుతోంది. పిల్లలకు ఐఐటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో హాస్టల్లో ఉంచి చదివిస్తున్న దంపతులు. పిల్లల చదువులకు అధిక డబ్బుల కోసమే విజయ భర్త దుబాయ్కు వెళ్లినట్టు తెలిసింది.
కుటుంబ కలహాలు లేవు: భర్త సురేందర్ రెడ్డి
తమ కాపురంలో ఎటువంటి కలహాలు లేవని విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి రైల్వే పోలీసులకు తెలిపాడు. ఆత్మహత్య ఘటన అనంతరం పోలీసులు మొబైల్ ఫోన్ ద్వారా సురేందర్ రెడ్డిని సంప్రదించారు. అప్పటికే తనకు సమాచారం అందిందని తాను దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరానని చెప్పాడు. తమ కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు ఏవీ లేవని తన భార్యా పిల్లలు ఇంత దారుణానికి ఎందుకు పాల్పడ్డారో అర్థం కావడం లేదని ఆయన పోలీసులకు తెలిపాడు. మరోవైపు తన చెల్లికి ఎలాంటి సమస్యలు లేవు అని అన్న చిరంజీవి రెడ్డి వెల్లడించారు. తన బావ, తన చెల్లిది అనోన్యో దాంపత్యమని తెలిపాడు. ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేవన్నాడు.
సారీ మేడం... ఇంకోసారి తప్పు చేయను
విజయశాంతి రెడ్డి హైటెక్ సిటీలోని ఒక కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అందులో పనిచేస్తున్న 15 మందికి గ్రూప్ లీడర్గా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించి ఆమె మొబైల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. తన మొబైల్ ఫోన్లో ఒక నంబర్ నుంచి సారీ మేడం ఇంకోసారి తప్పు చేయను అని ఒక మెసేజ్, గుడ్ మార్నింగ్ మేడం అని మరో మెసేజ్ ఉన్నట్టు పోలీసులు గుర్తించి వారిని పీఎస్కు రప్పించి విచారించే ఏర్పాట్లు చేస్తున్నారు.


