ఆ దంపతులకు పెళ్లయి అప్పటికే మూడు నెలలే అయ్యింది. కొత్త కాపురంలో ఎంతో అన్యోన్యంగా మెలిగారు వాళ్లు. ఎవరి దిష్టి తగిలిందో ఏమో.. ఓ సరదా సాయంత్రం ఇద్దరూ హైవేపై వాకింగ్కని బయల్దేరారు. ఇంతలో ఓ వాహనం హఠాత్తుగా దూసుకొచ్చి ఇద్దరినీ ఢీ కొట్టింది. భర్త అశీష్కు వాహనం బలంగా తగలడంతో స్పాట్లోనే చనిపోయాడు. భార్య అంజూ అపస్మాకర స్థితిలో రోడ్డ పక్కన పడిపోయింది. కాసేపటికి అటుగా వెళ్తున్న కొందరు వాళ్లను గమనించి వాళ్లను ఆస్పత్రికి తరలించి.. పోలీసులకు సమాచారం అందించారు.
అశీశ్ మృతదేహం స్ట్రెచ్చర్ మీద ఉంది. తన ప్రియాతిప్రియమైన భర్త ఇక లేడని తెలిసి గుండెలు అవిసెలా రోదిస్తున్న అంజూను చూసి అంతా ‘‘అయ్యో పాపం’’ అనుకున్నారు. ఈ ఘటనను తొలుత హిట్ అండ్ రన్ కేసుగా పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో అంజూ తడబడింది. పైగా తన బంగారు చెవి పొగులు కనిపించడం లేదని.. ఎవరైనా ఎత్తుకెళ్లి ఉంటారని చెప్పింది. దీంతో విచారణను పోలీసులు పలు కోణాల్లో జరపగా.. ఈ కేసు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగింది.
హనీమూన్ పేరిట భర్తను రాష్ట్రంకాని రాష్ట్రానికి తీసుకెళ్లి.. నిర్మానుష్య ప్రాంతంలో ప్రియుడితో కలిసి హత్య చేయించింది మధ్యప్రదేశ్ ఇండోర్కు చెందిన సోనమ్. ఆపై ఎలాంటి అనుమానాలు రాకుండా పెద్ద కథే నడిపించింది. హనీమూన్ మర్డర్ కేసుగా మేఘాలయాలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. సరిగ్గా ఈ ఘటన జరిగిన నెల వ్యవధిలో.. తెలంగాణలోని గద్వాల జిల్లాలో సర్వేయర్గా పని చేసే తేజేశ్వర్ను అతని భార్య ఐశ్వర్య ఖతర్నాక్ స్కెచ్తో మర్డర్ చేయించింది. ఈ రెండు ఘటనలు ఆ జంటకు పెళ్లైన స్వల్పకాలంలో జరగడంతో.. సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చే నడిచింది. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఘటనే..
రాజస్థాన్ శ్రీగంగానగర్ జిల్లాలో మరో హనీమూన్ మర్డర్ కేసు బయటపడింది. పెళ్లైన కొన్నాళ్లకే తన భర్త అశీశ్ను ప్రియుడి&కోతో కలిసి కిరాతకంగా హత్య చేయించింది భార్య అంజూ. అంతేకాదు.. కేసును హిట్ అండ్ రన్ కేసుగా క్లోజ్ చేయించేందుకు శతవిధాల ప్రయత్నించింది.

జనవరి 30వ తేదీ సాయంత్రం జరిగింది ఇదే..
అశీష్-అంజూలు జంటగా.. సాయంత్రం షికారు పేరుతో వాకింగ్ చేస్తున్నారు. ఇంతలో వెనక నుంచి వచ్చిన సంజూ(అంజూ ప్రియుడు) అశీశ్పై బలంగా దాడి చేశాడు. కింద పడిపోయిన అశీల్ను రాకీ (రోహిత్), బాదల్ (సిద్ధార్థ్) గట్టిగా పట్టుకోగా.. సంజూ-అంజూలు ఊపిరి ఆగేదాకా గొంతు నులిమారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక.. అశీష్ మృతదేహాన్ని తమ వాహనంతో బలంగా ఢీ కొట్టి దూరం పడిపోయేలా చేశారు. ఆపై తన ఒంటిపై ఉన్న నగలను ప్రియుడికి అప్పగించి.. రోడ్డుకు ఓ పక్కన పడిపోయినట్లు నటించింది అంజూ.
అక్కడే దొరికింది..
అయితే వాంగ్మూలాల సమయంలో ఒక్కోసారి ఒక్కోలా ఆమె ఇచ్చిన స్టేట్మెంట్.. ఆమెను అడ్డంగా దొరికిపోయేలా చేసింది. అనుమానంతో అంజూ ఫోన్ రికార్డులు పరిశీలించగా.. అందులో సంజూ అనే వ్యక్తితో తరచూ ఆమె మాట్లాడినట్లు తేలింది. అంతేకాదు.. అశీశ్ కలిశాక ఆ కాల్స్ మరింత ఎక్కువ అయ్యాయని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో తమదైన శైలిలో ప్రశ్నించగా.. అంజూ-సంజూలు నిజం ఒప్పేసుకున్నారు.

అశీశ్తో తనకు వివాహం ఇష్టం లేదని.. పెద్దల బలవంతం మేరకే చేసుకున్నానని.. పెళ్లి తర్వాత ఓరోజు సంజూ ఇంటికి వెళ్లి తన భర్తను అడ్డు తొలగించుకోవడం గురించి మాట్లాడుకున్నామని.. ఈ ప్లాన్ను సంజూ తన స్నేహితులతో అమలు చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. ఆపై దొంగతనం జరిగినట్లు నాటకం ఆడాలని ప్రయత్నిస్తే.. పోలీసులే హిట్ అండ్ రన్గా కేసు నమోదు చేసుకోవడంతో తన పని తేలిక అయ్యిందని భావించానని.. కానీ, పోలీసుల విచారణలో కంగారులో తడబడ్డానని అంజూ చెప్పుకొచ్చింది. దీంతో.. కేసును హత్య కేసుగా మార్చుకున్న పోలీసులు అశీశ్ భార్య అంజు, ఆమె ప్రియడు సంజు, సంజూ స్నేహితులు రాకీ, బాదల్ను అరెస్టు చేశారు.
సోనమ్ కూడా..
కిందటి ఏడాది మే నెలలో మధ్యప్రదేశ్ ఇండోర్లో జరిగిన హనీమూన్ హత్య కేసు గుర్తుండే ఉంటుంంది. సోనమ్ తన తండ్రి దగ్గర పని చేసే రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని ప్రేమించి.. ఆపై భర్త రాజా రఘువంశీని ఇష్టంలేని పెళ్లి చేసుకుని.. మంచిగా నటిస్తూ హనీమూన్ పేరిట భర్తను మేఘాలయాకు తీసుకెళ్లి అక్కడ ప్రియుడు, అతని స్నేహితులతో కలిసి దారుణంగా హత్య చేయించిది. ఆపై ఏం ఎరగనట్లు కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉండి.. ఆపై రోడ్డుపై ఓ దాబాకు దీనావస్థలో(డ్రామా) చేరి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, చివరకు పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.


