
సాక్షి, విజయవాడ: ప్రతిపక్షనేత చంద్రబాబుకు మంత్రి మేరుగ నాగార్జున సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు తాము సిద్దమని వెల్లడించారు. తమతో చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్దకు బాబు రావాలని చాలెంజ్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఎవరైనా చర్చకు రావాలని అన్నారు. సైకిల్ను జనం తొక్కేశారని, మడతపెట్టి పక్కన పడేశారని విమర్శించారు. త్వరలోనే మళ్ళీ అదే జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు దళిత ద్రోహి అని మండిపడ్డారు.
కళ్యాణమస్తు, షాదీతోఫా కింద రూ. 78.53 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేశారని మంత్రి పేర్కొన్నారు. పెళ్లికానుక కింద చంద్రబాబు 70 కోట్లు ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఆ మొత్తాన్ని కూడా సీఎం జగన్ ఇచ్చారన్నారు. వైఎస్ జగన్ నిబద్ధత కలిగిన నాయకుడు అని, ఆయన్ని నమ్ముకుని నడుస్తున్నామన్నారు. ఎవరైనా పక్కకు వెళ్లినా తిరిగి పార్టీలోకి వస్తారని చెప్పారు.