With LK Advani Letter Congress Slams BJP Amid Row Over CEC Bill - Sakshi
Sakshi News home page

సీఈసీ ప్రతిపాదిత బిల్లు.. తెరపైకి అద్వానీ లేఖ.. ఏముందంటే..

Aug 11 2023 8:38 PM | Updated on Aug 11 2023 8:45 PM

With LK Advani Letter Congress Slams BJP Amid Row Over CEC Bill - Sakshi

అద్వానీ లేఖలో అంత స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. ఆయన మాటల్ని బీజేపీ.. 

ఢిల్లీ: ఎన్నికల సంఘం నియామకాలకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన బిల్లు ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బీజేపీకి కౌంటర్‌ ఇచ్చే క్రమంలో.. కాంగ్రెస్‌ కమలం పార్టీ సీనియర్‌, రాజకీయ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ రాసిన ఓ లేఖను తెరపైకి తెచ్చింది. 

ఎన్నికల అధికారులను నియమించే ప్యానెల్ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని  (CJI) తప్పించే ప్రతిపాదిత బిల్లుకు కౌంటర్‌ ఇచ్చే క్రమంలో అద్వానీ లేఖను కాంగ్రెస్‌ తెరపైకి తెచ్చింది.  ఆ పార్టీ జైరాం రమేష్‌ ఈ మేరకు లేఖను షేర్‌ చేశారు. 

2012లోనే.. ఇలాంటి నియామకాలను పర్యవేక్షించేందుకు విస్తృత స్థాయి కొలీజియం ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రతిపక్ష నేతగా ఉన్న అద్వానీ లేఖ ద్వారా సూచించారు.  రాజ్యాంగబద్ధమైన సంస్థగా ఎన్నికల కమిషన్ పనితీరులో స్వతంత్రతను అనుమతించాలంటే.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల కార్యాలయం, అలాగే ఎన్నికల కమిషనర్లు కార్యనిర్వాహక జోక్యానికి దూరంగా ఉండాలి అని అద్వానీ ఆ లేఖ స్పష్టంగా అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉంటే.. రాజ్యసభలో ఈ బిల్లును గురువారం ప్రవేశపెట్టారు.  ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసే ఓ కేంద్ర క్యాబినెట్ మంత్రితో కూడిన ప్యానెల్ సిఫారసుల ఆధారంగా.. రాష్ట్రపతి ఎన్నికల సంఘం ఉన్నతాధికారులను నియమించాలన్నది ప్రతిపాదిత బిల్లు సారాంశం.

అయితే.. ప్యానెల్‌లో ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు,  భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండాలని సుప్రీంకోర్టు మార్చిలో తీర్పు ఇచ్చింది. అయినా కేంద్రం ఆ తీర్పును పట్టించుకోకుండా తమ పని చేసుకుంటూ పోయింది. చీఫ్‌ జస్టిస్‌ ప్లేస్‌లో కేబినెట్‌ మంత్రిని చేర్చింది.

CEC బిల్లు విషయంలో కేంద్రం చర్య.. అద్వానీ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉండడమే కాదు.. మార్చి 2వ తేదీన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని జైరామ్‌ రమేశ్‌ తన ట్వీట్‌లో విమర్శించారు. అయితే ఈ  బిల్లు, ఎన్నికల వేళ ఎన్నికల సంఘాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే యత్నంగా కనిపిస్తోందని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు.  

ఇదిలా ఉంటే.. ఎన్నికల కమిషనర్‌ అనూప్‌చంద్ర పాండే 2024, ఫిబ్రవరి 14వ తేదీతో రిటైర్‌ కానున్నారు. అదే సమయంలో ఎన్నికలూ జరగాల్సి ఉంది. దీంతో పోల్‌ ప్యానెల్‌ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు తీర్పునకు ముందు.. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌, ఎలక్షన్‌ కమిషనర్లను ప్రభుత్వ సిఫార్సుల మీద రాష్ట్రపతి నియమించేవారు. 

ఇదీ చదవండి: మన్మోహన్‌సింగ్‌ విషయంలో మరీ ఇంత దుర్మార్గమా?

Advertisement
 
Advertisement
Advertisement