సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.
‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.
‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు.

..రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.


