
సాక్షి, బళ్లారి: ప్రధాని మోదీ విషసర్పమన్న ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకి, వారి నేతలకు మతి భ్రమించిందనేందుకు రుజువని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దుయ్యబట్టారు. శుక్రవారం కర్ణాటకలో గదగ్, ధార్వాడ జిల్లాల్లో ఆయన పలు సభలో మాట్లాడారు. ‘‘మోదీని విషసర్పంతో పోల్చడం ఆ పార్టీ ఎంతగా దిగజారిందనేందుకు రుజువు. వారెంతగా విమర్శిస్తే అంతగా ఆయనకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది’’ అన్నారు. ‘తీవ్రవాద భావజాల పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)ను నిషేధించినందుకు నాపై కేసు పెట్టారు.
పీఎఫ్ఐను కాంగ్రెస్ నెత్తిన పెట్టుకుంది. దానిపై నిషేధం తర్వాత కర్ణాటక సురక్షితంగా ఉంది’’ అన్నారు. ‘‘సీఎం తానంటే తానని పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సిద్ధరామయ్య వాదులాడుకుంటున్నారు. అవసరం లేదు. సీఎం బీజేపీ వ్యక్తే అవుతారు. కన్నడ ఓటర్లు బీజేపీనే గెలిపిస్తారు. ఓటర్ల నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ వాగ్దానాలను ఎవరు విశ్వసిస్తారు?. కొన్ని విషయాల్లో మాత్రం కాంగ్రెస్ ఇచ్చే గ్యారెంటీని ఖచ్చితంగా నమ్మవచ్చు. అవి.. అబద్దాలు, అవినీతి, కులతత్వం, వంశపాలన, బుజ్జగింపు రాజకీయాలు’ అంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు.