కోల్‌కతాలో కామెడీ క్లైమాక్స్‌.. పెళ్లికి మమత ఇచ్చిన కానుకలు రిటర్న్ | Kakoli Ghosh Dastidars son will return Mamata Banerjees wedding gifts | Sakshi
Sakshi News home page

కోల్‌కతాలో కామెడీ క్లైమాక్స్‌.. పెళ్లికి మమత ఇచ్చిన కానుకలు రిటర్న్

Jun 15 2026 5:44 PM | Updated on Jun 15 2026 7:09 PM

 Kakoli Ghosh Dastidars son will return Mamata Banerjees wedding gifts

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు వర్గానికి చెందిన ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ కుమారుడు బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ తీసుకున్న ఓ నిర్ణయంపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ జరుగుతోంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నుంచి తాను అందుకున్న అన్ని కానుకలను తిరిగి ఇస్తానని బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఎక్స్‌లో తెలిపారు. 

రెండేళ్ల క్రితం తన పెళ్లి సందర్భంగా తన భార్యకు మమతా బెనర్జీ ఇచ్చిన బంగారు హారం, దుర్గాపూజ సమయంలో తనకు ఇచ్చిన పంజాబీ-పైజామా దుస్తులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ ప్రకటన సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీసింది.

ఇది తన మనస్సాక్షికి సంబంధించిన విషయం అని బైద్యనాథ్ ఘోష్ చెప్పారు. "ఆ ఆప్యాయతకు నేను కృతజ్ఞుడిని. అయితే ఇటీవలి పరిణామాల దృష్ట్యా, నా మనస్సాక్షి చెప్పింది విని ఈ కానుకలను తిరిగి ఇవ్వడం సముచితమని భావిస్తున్నాను" అని పోస్టులో బైద్యనాథ్ ఘోష్ పేర్కొన్నారు.

"ఆ హారం బ్యాంకు లాకర్‌లో ఉంది. గత రెండేళ్లలో ఆ బంగారు హారం విలువపై వచ్చిన వడ్డీకి సమానమైన మొత్తాన్ని జత చేసి ఈ కానుకలన్నీ తిరిగి ఇస్తాను. వీలైనంత త్వరగా వాటిని ఆమె కాళీఘాట్ నివాసానికి పంపిస్తాను" అని తర్వాత మీడియాతోనూ చెప్పారు.

మమతతో పాటు సౌగత రాయ్, కల్యాణ్ బెనర్జీ, మహువా మోయిత్రా, సోనాలి గుహ సహా కొందరు టీఎంసీ నేతలు తనపై, తన కుటుంబంపై పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని బైద్యనాథ్ ఆరోపించారు. తనపై, తన తల్లిపై చేసిన వ్యాఖ్యల విషయంలో మమత, టీఎంసీకి చెందిన పలువురు సీనియర్ నేతలను బహిరంగ క్షమాపణ కోరుతూ న్యాయపరంగా కూడా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు.

ఈ వివాదంపై స్పందించిన సౌగత మాట్లాడుతూ.. "కాకోలి కుమారుడు చేసిన ఈ వ్యాఖ్యలు చిన్నపిల్లల తరహాలో ఉన్నాయి, ఆధారరహితమైనవి. మమతా బెనర్జీకి కానుకలు తిరిగి ఇవ్వాలన్న అతని నిర్ణయం హాస్యాస్పదం. నాకు ఏదైనా న్యాయపరంగా నోటీసు వస్తే, తగిన విధంగా స్పందిస్తాను" అని అన్నారు.

బైద్యనాథ్ ఘోష్ దస్తిదార్ ఎక్స్‌లో చేసిన పోస్టుపై స్పందించిన నెటిజన్లు.. కానుకలు తిరిగి ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్న టైమింగ్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. కొందరు ఈ చర్యను హాస్యాస్పదంమని పేర్కొనగా, మరికొందరు ఇది రాజకీయ ప్రేరణతో తీసుకున్న నిర్ణయమని అన్నారు. బైద్యనాథ్‌పై చాలామంది నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement