బాబూ.. ఇసుక దోపిడీలో సోమిరెడ్డిదే ఫస్ట్‌ ర్యాంక్: మాజీ మంత్రి కాకాణి | Kakani Govardhan Reddy Satirical Comments On Somireddy | Sakshi
Sakshi News home page

బాబూ.. ఇసుక దోపిడీలో సోమిరెడ్డిదే ఫస్ట్‌ ర్యాంక్: మాజీ మంత్రి కాకాణి

Aug 2 2024 10:47 AM | Updated on Aug 2 2024 1:13 PM

Kakani Govardhan Reddy Satirical Comments On Somireddy

సాక్షి, నెల్లూరు: ఏపీలో పేదవాడిని దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెడుతున్నారు. వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

కాగా, మాజీ మంత్రి కాకాణి గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘ఉచిత ఇసుక అంతా భూటకమే.. వినియోగదారుడు మీద పెనుభారం పడుతుంది. పేదవాడిని దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకు ఇసుక విధానం తీసుకొచ్చారు. పొదలకూరు మండలం విరువూరు ఇసుక రీచ్ నుంచి రోజుకి 100 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణాను గ్రామస్తులే అడ్డుకున్నారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇలాకాలో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి అండదండలతో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ప్రతీలోడ్‌కు ఐదు వేలు వసూలు చేస్తున్నారు. అడ్డుకున్న గ్రామస్తులపై దాడికి ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ టక్కులను రీచ్ వద్దనే వదిలేసి టీడీపీ నేతలు పరారు అయ్యారు. సహజ వనరులను టీడీపీ నేతలు దోచుకుంటుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్, మైనింగ్, ఎస్పీ పనిచేస్తున్నారా?. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వానికి ఏడాదికి 790 కోట్లు ఆదాయం వచ్చింది. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేది..

సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నాడు జరగని అవినీతి జరుగుతుంది. దీని మీద చంద్రబాబు విచారణ జరిపిస్తే.. సోమిరెడ్డి బాగోతం బయటపడుతుంది. చంద్రబాబు ర్యాంక్‌లు ప్రకటిస్తే.. అవినీతిలో సోమిరెడ్డికి నంబర్ వన్ ర్యాంక్ వస్తుంది. దోపిడీని ఆపకపోతే గ్రామాలకు గ్రామాలు రోడ్డెక్కుతాయి. శాంతిభద్రతలకి విఘాతం కలుగుతుంది. ఇసుక దందాపై జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement