Jayant Patil May Leave Sharad Pawar Camp To Join Maha Govt - Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో కీలక పరిణామం.. ఎన్సీపీలో మళ్లీ చీలిక..?

Aug 6 2023 4:34 PM | Updated on Aug 6 2023 5:28 PM

Jayant Patil May Leave Sharad Pawar Camp To Join Maha Govt - Sakshi

ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు ఇటీవల కీలక మలుపులు తీసుకుంటున్నాయి. రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ ఇటీవల రెండుగా చీలిన విషయం తెలిసిందే. కొంత మంది నేతలతో అజిత్‌ పవార్‌.. ఎన్సీపీని చీల్చి ఎన్సీయేతో కలిసి ఉపముఖ్యమంత్రి పదవి పొందారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఓ వర్గం కాగా.. శరద్ పవార్ నాయకుడిగా ఎన్సీపీ మరో వర్గంగా ఏర్పడ్డారు. అయితే.. తాజాగా శరద్ పవార్ అధినేతగా ఉన్న ఎన్సీపీలో జయంత్ పాటిల్ రూపంలో మళ్లీ తిరుగుబాటు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

జయంత్ పాటిల్‌ తిరుగుబాటు చేయనున్నారని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశారు. దీంతో జయంత్ పాటిల్ పార్టీ మారనున్నారని పుకార్లు ఎక్కువయ్యాయి. ఆదివారం ఉదయం జరిగిన భేటీలో ఒప్పందం కుదిరినట్లు సమాచారం. జయంత్ పాటిల్‌తో పాటు రాజేశ్ తోపే పేరు కూడా ఇందులో వినిపిస్తోంది. 

రాష్ట్రంలో సంగాలీ స్థానం నుంచి తనకు ఎంపీ టికెట్టు, తన కుమారునికి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని జయంత్ పాటిల్ డిమాండ్ చేసినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే ఎన్డీయేలో కలుస్తారని రాజకీయ వర్గాల‍్లో మాట్లాడుకుంటున్నారు. 

2024 ఎన్నికల్లో విజయం దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే పుణె జిల్లాల్లోని నాలుగు స్థానాలకు సంబంధించిన నాయకులతో నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీలోనే అమిత్‌ షాతో జయంత్ పాటిల్ కలిసినట్లు తెలుస్తోంది. 

అయితే.. ఈ ఊహాగానాలను జయంత్ పాటిల్ కొట్టిపారేశారు. తాను అమిత్‌ షాతో కలవలేదని స్పష్టం చేశారు. శరద్‌ పవార్‌కు విధేయుడిగానే ఉంటానని పేర్కొన్నారు. 

  

ఇదీ చదవండి: దేశంలో 508 రైల్వేస్టేషన్ల పునరుద్ధరణ పనులకు ప్రధాని శంకుస్థాపన

Advertisement
 
Advertisement
Advertisement