వైఎస్సార్‌సీపీ దీక్ష.. జేసీ కుట్ర.. తాడిపత్రిలో హైటెన్షన్‌ | Fresh Tension in Tadipatri as YSRCP Calls Mass Hunger Strike | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ దీక్ష.. జేసీ కుట్ర.. తాడిపత్రిలో హైటెన్షన్‌

Jun 26 2026 8:18 AM | Updated on Jun 26 2026 8:18 AM

Fresh Tension in Tadipatri as YSRCP Calls Mass Hunger Strike

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి హింసాత్మక రాజకీయాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు సామూహిక నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. తాడిపత్రిలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది.

తాడిపత్రి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తాడిపత్రికి తరలిరావాలని ఆయన కోరారు.

ఈ నేపథ్యంలో.. అనంతపురం అర్బన్‌, శింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తాడిపత్రికి బయలుదేరారు. భారీగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేరుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు చెబుతున్నారు. అయితే వైఎస్సార్‌సీపీ మాత్రం పోలీసుల తీరుపై మండిపడుతోంది. 

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యాలకు పోలీసులు సహకరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దీక్షను విజయవంతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement