
విజయవాడ: కూటమి ప్రభుత్వంపై సినీ పరిశ్రమకు కనీస మర్యాద, కృతజ్ఞతలు లేవంటూ ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్.. థియేటర్లు తమ బంద్ నిర్ణయాన్ని విరమించినా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ మేరకు థియేటర్లకు మరోసారి వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్.
సినిమా హాళ్లలో ధరలపై విచారణ జరపాలంటూ ఆదేశించారు ఈ మేరకు మంత్రి దుర్గేష్ తో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. సినిమాహాళ్ల బంద్ నిర్ణయంపై సైతం విచారణ జరిపించాలని ఆదేశించారు. సినిమా హాళ్లలో స్నాక్స్, డ్రింక్స్ ధరలపై విచారణకు ఆదేశించారు.
తన శాఖకు సంబంధం లేకపోయినా విచారణకు ఆదేశించడం గమనార్హం. దీనిలో భాగంగా పవన్ కల్యాణ్ కార్యాలయం మరోసారి అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో సినిమా టికెట్ల ధరల పెంపునకు రావొద్దని హెచ్చరించింది. ఒకవేళ టికెట్ల ధరలు పెంచాలంటే ఫిలిం చాంబర్ ద్వారా రావాలని ఆదేశాల్లో పేర్కొంది. పాప్ కార్న్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిళ్ల ధరలు థియేటర్లలో అధికంగా ఉన్నాయని, ఆ ధరలన్నీ నియంత్రించాలని ఆదేశాల్లో డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.
మల్టీఫ్లెక్స్లు, సింగిల్ స్క్రీన్ ల ధరల్లో గుత్తాధిపత్యం నడుస్తోందని, థియేటర్లలో పారిశుధ్యం లేకపోతే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర ఫిలిం డెవలప్ మెంట్ పాలసీ తేవాలని నిర్ణయించారు.
గతంలో సినిమా రంగంపై ప్రభుత్వం జోక్యం ఏంటంటూ ఊగిపోయిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వరుస పెట్టి ఇండస్ట్రీని వేధింపులకు గురి చేయడం చర్చనీయాంశమైంది. సినిమా ఇండస్ట్రీని లొంగదీసుకుని విచారణకు ఆదేశాలు జారీ చేయడం ఏంటనే విమర్శ వినిపిస్తోంది. గతంలో టికెట్ల ధరలను నియంత్రించిన సందర్భంలో సైతం అప్పటి ప్రభుత్వంపై విమర్శలు చేశారు పవన్ కల్యాణ్. ఇలా పవన్ ద్వంద్వ వైఖరి ఏమిటనే విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు. అప్పుడు ఆ రకంగా ఊగిపోయారు.. ఇప్పుడు ఈ రకంగా లొంగదీసుకోవాలని చూడటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
