
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ నిరసనలు, ఆందోళనలకు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ కౌంటరిచ్చారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలులో ఉన్నారని అన్నారు. యాత్రల పేరుతో టీడీపీ నేతలు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, దేవినేని అవినాష్ శుక్రవారం విజయవాడలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ.. నిజం గెలిస్తే చంద్రబాబు శాశ్వతంగా జైలులోనే ఉంటారు. ఎన్ని కేసులు ఉంటే అన్ని పదవులు ఇస్తామని నారా లోకేష్ చెప్పాడు. లోకేష్ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు పనిగట్టుకుని ఆందోళనలు చేస్తున్నారు. యాత్రల పేరుతో ఎన్ని అస్యత ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో పయనిస్తోంది.
పేద, వృద్ధులకు జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఒక వరం. ప్రజల వద్దకే వైద్యం ద్వారా సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. 14 సంవత్సరాల సీఎం, 43ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా టీడీపీ నాయకులకు మంచి మనసు లేదు. గతంలో టీడీపీ జెండా మోసిన వారికే పథకాలు అందేవి. అదే సీఎం జగన్ ప్రభుత్వంలో అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలవుతున్నాయి. ఇంటి వద్దకే ఆరోగ్యం, సంక్షేమం, పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మాది. అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేవటం అని అన్నారు.
ఇది కూడా చదవండి: సీఎం జగన్ పాలనలో సామాజిక విప్లవం: వైఎస్సార్సీపీ నేతలు