టీడీపీ నేత పట్టాభికి కోర్టు చీవాట్లు | Court reprimands TDP leader Pattabhi | Sakshi
Sakshi News home page

టీడీపీ నేత పట్టాభికి కోర్టు చీవాట్లు

Oct 1 2023 4:43 AM | Updated on Oct 1 2023 4:43 AM

Court reprimands TDP leader Pattabhi - Sakshi

తణుకు: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి­రాంకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణ పోలీసులు శనివారం 41(ఎ) నోటీసులి­చ్చారు. న్యాయస్థానం చీవాట్లు పెట్టడంతో పట్టాభి ఎట్టకేలకు తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. శనివారం ఉదయం పోలీస్‌­స్టేషన్‌కు వచ్చిన ఆయ­నకు నోటీసులు అందజేసిన పోలీసులు సుమారు మూడు గంటల పాటు స్టేషన్‌లోనే విచారించారు. ఈ ఏడాది మే ఆరో తేదీన టీవీ–5 చానెల్‌లో డిబే­ట్‌లో పాల్గొన్న పట్టాభిరాం.. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వర­రావుతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

దీనిపై వైఎస్సార్‌సీపీ యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు వీరమల్లు ఫణీంద్రకుమార్‌ మే 8న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై 153, 153(ఎ), 505(2), 504, 120(బి) రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద అప్పటి పట్టణ సీఐ ముత్యాల సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఈ కేసులో పట్టాభిరాం ఎ–1 కాగా, యాంకర్‌ మూర్తి ఎ–2, టీవీ–5 యాజమాన్యం ఎ–3గా ఉన్నారు. అప్పట్లో ఎ–1 పట్టాభిరామ్‌కు 41(ఎ) నోటీ­­సులు ఇవ్వడానికి ప్రయత్నించినా స్పందించక­పోగా తనను పోలీసులు వేధిస్తున్నారని పేర్కొంటూ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

దీనిపై తణుకు పోలీసులు స్థానిక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నోటీసులు తీసుకోకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వకపోవడం చట్టరీత్యా నేరమని పేర్కొంటూ తక్షణమే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నోటీసులు తీసుకుని సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో శనివారం తణుకు పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన పట్టాభిరాంకు పోలీసులు నోటీసులు అందించారు. తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి రూరల్‌ సీఐ మూర్తి నేతృత్వంలో తణుకు పట్టణ ఎస్‌ఐ కె.శ్రీనివాస్‌ నోటీసులిచ్చి వాంగ్మూలం తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement