బతికుండగా వేధించారు.. మరణించాక కూడా రాజకీయం చేస్తారా?
సొంత కూతురితోనే తిట్టించిందెవరు?
చివరకు ప్రభుత్వ లాంఛనాల పేరుతో రాజకీయం చేసిందెవరు?
మాజీమంత్రికి ప్రభుత్వ లాంఛనాలు భిక్ష కాదు.. సంప్రదాయం
బహిరంగలేఖలో ప్రశ్నలు సంధించిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి
సాక్షి, అమరావతి : మాజీమంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బతికుండగా వేధించారు.. మరణించాక కూడా రాజకీయం చేస్తారా? ఆయన ఆత్మను క్షోభకు గురిచేస్తారా? అంటూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్పీఎస్) ఘాటుగా స్పందించింది. ముద్రగడపై పథకం ప్రకారం సాగిన రాజకీయ కక్షసాధింపును గమనించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కేఆర్పీఎస్ రాష్ట్ర చైర్మన్ కాజా సత్యనారాయణ, వర్కింగ్ చైర్మన్ మసాబత్తుల శ్రీనివాస్, కన్వీనర్ రావి శ్రీనివాస్, కో–ఆరి్డనేటర్ జె.టి.రామారావు, కో–కనీ్వనర్లు కాకిలేటి హరనాథ్, వలవల శ్రీధర్నాయుడు ఆదివారం బహిరంగలేఖను విడుదల చేశారు.
రాష్ట్రంలో పాలకపక్షం ముద్రగడ అనారోగ్యం, మరణం, మరణానంతరం కూడా రాజకీయం చేసే ప్రయత్నాలకు పాల్పడిన తీరును రాష్ట్రంలోని యావత్ కాపు సమాజం, కాపు ప్రజాప్రతినిధులు, కాపు సంఘాలు నిశితంగా గమనించాలని సూచించారు. వ్యక్తిగత అనారోగ్యాన్ని సైతం రాజకీయాలకు వాడుకోవడం, వారి కుటుంబంలో ఉన్న మనస్పర్ధలను రాజకీయం చేయడం, కన్నతండ్రి పైనే కూతురిని ఉసిగొల్పడాన్ని గమనిస్తే మనవేలితో మనకళ్లే పొడుస్తున్నారనే విషయం అర్థమవుతుందని పేర్కొన్నారు. కొత్తగా కాపులను కాపులతోటే చంపించే సంస్కృతికి తెరలేపారన్నారు.
విజయవాడలో చనిపోయిన వ్యక్తి, చంపిన సీఐ కూడా కాపులేనని బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా ప్రకటించేస్థాయికి దిగజారిపోయారన్నారు. ఎన్టీఆర్కు పథకం ప్రకారం ముద్రగడను దూరం చేసిందెవరనేది అందరికీ తెలుసునని పేర్కొన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ తన పదవికి రాజీనామా చేసి.. బలమైన కాపు ఉద్యమం చేపట్టి ఏడురోజుల ఆమరణ దీక్షతో సాధించిన జీవో 30 అమలు చేయకుండా తుంగలో తొక్కింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు.
రాజకీయ స్వార్థం కోసం కూతురుతో తండ్రిని తిట్టించిందెవరు?
రాజకీయ స్వార్థం కోసం కూతురును జనసేనలో చేర్పించి కన్నతండ్రినే తిట్టించింది ఎవరు? తల్లిదండ్రులను కనీసం తన ఇంట్లోకి రానివ్వని కూతురు ఆయన మరణం తర్వాత ఆడిన సానుభూతి డ్రామాకు ఒక వర్గం భారీ ప్రచారం కల్పించడంలో ఎవరి ప్రమేయం ఉంది? చివరకు మాటకు కట్టుబడి పేరు మార్చుకుంటే కులం మార్చుకున్నారంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది ఎవరు? అనే అనేక ప్రశ్నలకు జవాబులు వెదికితే.. వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో కాపు సమాజం గమనించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
చివరకు అధికార లాంఛనాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉదారంగా ఇచ్చినట్టు.. వాటిని వైఎస్సార్సీపీ అడ్డుకుందనే తప్పుడు ప్రచారం చేశారని గుర్తుచేశారు. వాస్తవానికి మాజీమంత్రి అంత్యక్రియలకు అధికార లాంఛనాలనేవి ఎవరి భిక్ష కాదు.. అది ఆనవాయితీ అనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. ముద్రగడ కుటుంబసభ్యులే అధికార లాంఛనాలు వద్దని స్పష్టంగా చెప్పినా కూడా పోలీసులు ఎవరి ఒత్తిడితో చేయడానికి ప్రయత్నించారని నిలదీశారు.
గతంలో చంద్రబాబు అమలు చేయని రిజర్వేషన్లను వైఎస్ జగన్ నిలిపేసినట్టు ప్రచారం చేసిన విధంగానే ఇప్పుడు ముద్రగడకు అధికార లాంఛనాలపైనా తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయో గమనించాలని కోరారు. ఇప్పటికైనా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కాకినాడ జిల్లాకు ముద్రగడ పద్మనాభం, కృష్ణాజిల్లాకు వంగవీటి మోహన్రంగా పేర్లు పెట్టి, కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని కేఆర్పీఎస్ డిమాండ్ చేసింది.


