పార్టీ ఫిరాయింపులు.. చట్టానికి తూట్లు! | controversy partisan role of the many speakers in democracy | Sakshi
Sakshi News home page

చట్టానికి తూట్లు!

Nov 19 2025 12:33 PM | Updated on Nov 19 2025 5:28 PM

controversy partisan role of the many speakers in democracy

కొంతకాలంగా శాసనసభ స్పీకర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా పార్టీ ఫిరాయించిన శాసన సభ్యులపై ఫిరాయింపు నిరోధక చట్ట నిబంధనల మేరకు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు రావటంతో స్పీకర్లు రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు తాజా ఉదాహరణగా తెలంగాణలో చోటు చేసుకున్న పరిస్థితిని పేర్కొన వచ్చు. 2014లో రాష్ట్ర ఏర్పాటు నుండి ఇప్పటివరకు దరిదాపు 53 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. కానీ ఏ ఒక్క శాసనసభ్యుడి పైనా స్పీకర్లు ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం చర్యలు చేపట్టలేదు.

తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పార్టీ ఫిరాయించిన పదిమంది శాసనసభ్యులపై చర్యలు చేపట్టడంలో జాప్యం చేస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ పార్టీ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ వేసింది. విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ‘పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పదిమంది శాసనసభ్యులపై చర్య తీసుకోకపోవడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది. చర్య మీరు తీసుకుంటారా లేక మేమే నిర్ణయం తీసుకోవాలా?’ అని స్పీకర్‌ను ప్రశ్నించింది. ‘కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలని కోరుకుంటున్నారు?’ అని కూడా స్పీకర్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌ ఘాటుగా హెచ్చరించారు. 

స్పీకర్‌ చట్టసభల గౌరవాన్ని కాపాడాలి. పార్టీ ప్రతినిధిగా కాకుండా రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాలి. పార్లమెంటరీ సంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటించాలి. కానీ చాలా రాష్ట్రాలలో స్పీకర్లు దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర కృష్ణానగర్‌  శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ తరఫున గెలిచిన ముకుల్‌ రాయ్‌ టీఎంసీలోకి ఫిరాయించటంతో బీజేపీ లెజిస్లేటివ్‌ పార్టీ నాయకుడు సువేందు అధికారి అతడిని అనర్హునిగా ప్రకటించాలని స్పీకర్‌కి ఫిర్యాదు చేశారు. ఆ సభ్యుడిపై అనర్హత వేటువేయకుండా స్పీకర్‌ జాప్యం చేస్తుండటంతో కలకత్తా హైకోర్టుని ఆశ్రయించారాయన. దీంతో కోర్టు... పార్టీ ఫిరా యించిన శాసనసభ్యుడిని ఇటీవలే అనర్హునిగా ప్రకటించింది. 2023లో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హిమాచల్‌ ప్రదేశ్‌లో ఆరు గురు కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు బీజేపీ రాజ్యసభ అభ్యర్థికి ఓటు వేసి సొంత పార్టీ అభ్యర్థి ఓటమికి కారణమైనారు. ఆ ఆరుగురు శాసన సభ్యులను స్పీకరు తక్షణమే అనర్హులుగా ప్రకటించారు. 

కానీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ నుండి గెలిచి అధికారకాంగ్రెస్‌లోకి ఫిరాయించిన పదిమంది శాసనసభ్యులపై చర్య తీసుకోవడానికి స్పీకరుకు మరికొంత వ్యవధిని సుప్రీంకోర్టుఇచ్చింది. ఇప్పటికైనా స్పీకరు చర్యలు తీసుకుంటారా?పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అమలు చేయకుండా ఒక్కొక్క రాష్ట్రంలో స్పీకర్లు ఒక్కొక్క తరహా నిర్ణయం తీసుకోవడంతో చట్టం అపహాస్యం పాలవుతోంది. ఫిరాయింపు నిరోధక చట్టంలో ఉన్న ‘ఒక పార్టీ ప్రజాప్రతినిధుల్లో 2/3 వంతు మంది పార్టీ మారితే అది ఫిరాయింపు చట్టం పరిధిలోకి రాదు’ అనే నిబంధనను అడ్డు పెట్టుకొని 2014లోనూ, 2018లోనూ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హత వేటు నుండి తప్పించు కున్నారు. చట్టంలోని ఇటువంటి మినహాయింపులను సాకుగా చూపి ఫిరా యింపుదారులూ, స్పీకర్లూ చాలా సార్లు రాజ్యాంగ విలువలకే తూట్లు పొడవడం శోచనీయం. ఈ చట్టాన్ని మరింత పదునైనదిగా మార్చినప్పుడే కొంతమేరకైనా పార్టీ ఫిరాయింపులను నిరోధించ గలుగుతాం.

– డా.తిరునహరి శేషు
ఆర్థికశాస్త్ర బోధకులు, కాకతీయ విశ్వవిద్యాలయం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement