
సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లింది
భారత్లోని పాలకపక్షం కోపం, ద్వేషం కనబరుస్తోంది
కాంగ్రెస్ పార్టీ దృష్టి కోణం మాత్రం ప్రేమ, ఆప్యాయతలే
భారత్ సమ్మిట్–2025లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ పాత తరం రాజకీయాలకు కాలం చెల్లిందని.. అందుకే భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త రాజకీయ నాయకత్వం రావాలని.. దాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. అందుకు భారత్ సమ్మిట్–2025 వేదిక కావాలని ఆకాంక్షించారు. రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగిన ప్లీనరీకి ముఖ్యఅతిథిగా రాహుల్గాంధీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ విధానాలను మార్చుకుంటున్నాయని చెప్పారు. భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు దారితీసిన పరిస్థితులతోపాటు యాత్రకు ముందు, ఆ తర్వాత తనలో రాజకీయంగా వచ్చిన మార్పుల గురించి వివరించారు. దేశంలోని పాలకపక్షం ద్వేషం, కోపాలను విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తోందని రాహుల్ విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దృష్టి కోణం మాత్రం ప్రేమ, ఆప్యాయతలేనని స్పష్టం చేశారు.
దేశ ప్రజల్ని కలిసేందుకే భారత్ జోడో యాత్ర చేపట్టా
‘ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు మౌలిక విధానాలను మార్చుకుంటున్నాయి. పదేళ్ల క్రితం నాటి ఆలోచనలు ఇప్పుడు పనిచేయవు. ఒక్కమాటలో చెప్పాలంటే పాత తరం రాజకీయం చనిపోయింది. ఇప్పుడు కొత్త రకం రాజకీయాలు రావాలి. ఇది ప్రపంచ రాజకీయాలకు ఒక సవాల్ లాంటిది. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓ వలయంలో చిక్కు కొని ఒంటరైంది. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయా లనే ఆలోచనలో భాగంగా మా అవకాశాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించా.
అందుకే దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడక ద్వారా ప్రజలను కలవాలనే నిర్ణయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కి.మీ. పాదయాత్ర చేశా. ఈ పాదయాత్రలో ఓపిక, ప్రేమ గురించి నేర్చుకున్నా. రాజకీయ నాయకులకు ఈ రెండు లక్షణాలు ఉండాలి. ప్రజలు ఏం చెబుతు న్నారన్నది ఓపికగా వినగలగాలి. ప్రజలపట్ల ప్రేమ, ఆప్యాయతలను చూపించగలగాలి. విధానాల రూపంలో ప్రజలతో పరోక్షంగా కలిసి ఉండటం కంటే వారిపట్ల ప్రేమ బంధం ఏర్పరచుకోగలగాలి’ అని రాహుల్ గాంధీ చెప్పారు.