‘తెలంగాణలో ఏపీ తరహా వ్యూహం.. బీజేపీ వదిలిన బాణమే కవిత’ | Congress Madhu Yaskhi Sensational Comments On MLC Kavitha | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో ఏపీ తరహా వ్యూహం.. బీజేపీ వదిలిన బాణమే కవిత’

Jun 2 2025 11:43 AM | Updated on Jun 2 2025 12:30 PM

Congress Madhu Yaskhi Sensational Comments On MLC Kavitha

సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదంటూ కాంగ్రెస్‌ నాయకులు మధు యాష్కీ సంచలన ఆరోపణలు చేశారు. బంగారు బతుకమ్మ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించారు. తెలంగాణ జాగృతిలో 800 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇదే సమయంలో ప్రధాని మోదీ, అమిత్‌ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ నాయకులు మధుయాష్కీ తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘బీజేపీ వదిలిన బాణమే కవిత. ఒక మహిళగా రాష్ట్రంలోనే కాదు.. ఢిల్లీలో కూడా ఆమె కుంభకోణం చేశారు. తన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికే కొత్త డ్రామాకు తెర లేపారు. తెలంగాణ జాగృతిలో భారీ స్కాం జరిగింది. జాగృతిపై విచారణ జరపాలి. రాజీవ్ ప్రతాప్ రుడి పదవి పోవడానికి జాగృతి సంస్థ కారణం. జాగృతి సంస్థ అవినీతిలో కూరుకుపోయింది.

తెలంగాణలో చనిపోయిన రైతులకు ఆర్థిక సహాయం చేస్తామని కార్పొరేట్ సంస్థల దగ్గర జాగృతి డబ్బులు వసూలు చేసింది. జాగృతి దోపిడీకి అన్ని కార్పోరేట్ సంస్థలు బలయ్యాయి. కవిత మాఫియా డాన్. ఆమె చేయని వ్యాపారం లేదు.. దోచుకోని సంస్థ లేదు. కవిత ఏ వ్యాపారం చేసిందని జూబ్లీహిల్స్‌లో రెండు వేల కోట్ల ఆస్తులు వచ్చాయి. మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకు కవిత పనిచేస్తుంది. బీఆర్‌ఎస్‌ స్థానాన్ని బీజేపీ పొందాలనుకుంటుంది.. అందుకే  కవితను రంగంలోకి దింపింది. లిక్కర్ కేసు నుండి బయటపడటం కోసం కవిత బీజేపీకి పనిచేస్తోంది.

అవినీతి సొమ్ము దాచుకోవడానికే జాగృతి బలోపేతం అంటుంది. బీసీలకు న్యాయం చేస్తా అన్న కవిత.. జాగృతికి ఎందుకు అధ్యక్షురాలిగా ఉంది. జాగృతి అధ్యక్షురాలిగా బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు. నిస్వార్థంగా తెలంగాణ కోసం పనిచేసింది జయశంకర్.. కేసీఆర్ కాదు. ముఖ్యమంత్రి పదవి కోసమే కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో  చేరాడు. పదేళ్లు కేసీఆర్ కుటుంబం దోపిడిలో ఏంతో మంది బలయ్యారు. ఎంపీ సంతోష్ ఇప్పుడు ఎందుకు చెట్లు నాటడం లేదు.. పదేళ్లు చెట్ల పేరుతో సంతోష్ కోట్ల రూపాయలు దోచుకున్నాడు. కేటీఆర్‌కు అమెరికాలో పెట్టుబడులు ఉన్నాయి. వాటి లెక్కలు చూసుకోవడానికే కేటీఆర్‌ అమెరికాకు వెళ్లారు. ఏపీ తరహా వ్యూహాన్ని బీజేపీ తెలంగాణలో అమలు చేస్తుంది. ఏపీలో టీడీపీ, బీజేపీ తిట్టుకున్నాయి.. ఎన్నికల నాటికి రెండు కలసి పోటీ చేశాయి. తెలంగాణలో కూడా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయి’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement