కాంగ్రెస్‌కు లోక్‌సభ అభ్యర్థులు కరువు.. ముఖం చాటేస్తున్న కీలక నేతలు | Congress Discussions To Find 7-8 Ministers In Lok Sabha Polls In Karnataka | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు లోక్‌సభ అభ్యర్థులు కరువు.. ముఖం చాటేస్తున్న కీలక నేతలు

Mar 11 2024 7:45 PM | Updated on Mar 11 2024 9:10 PM

Congress Discussions To Find 7-8 Ministers In Lok Sabha Polls In Karnataka - Sakshi

బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్‌లో వింత పరిస్థితి చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్ధులు కరువయ్యారు. దీంతో చేసేది లేక పలువురు మంత్రులనే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దించేలా వారిని బుజ్జగించేందుకు పార్టీ అగ్రనాయకత్వం రంగంలోకి దిగిందంటూ పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.  

ఈ తరుణంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలని పార్టీలో చర్చలు జరుగుతున్నాయని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, హోంమంత్రి జి పరమేశ్వర అన్నారు.

స్క్రీనింగ్‌ కమిటీ తర్వాతే క్లారిటీ
అయితే లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు ఎవరనేది పార్టీ అంతిమంగా నిర్ణయిస్తుందని ఆయన..మంత్రుల్లో ఏడెనిమిది మంది మంత్రులు పోటీ చేయాలనే చర్చలు జరుగుతున్నాయని, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎవరైతే అంగీకరిస్తారో వారినే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపుతామని, నేటి సమావేశం (స్క్రీనింగ్ కమిటీ) తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరమేశ్వర చెప్పారు. 

ఢిల్లీకి జాబితా
కాగా, అభ్యర్థులను ఖరారు చేసేందుకు పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఈరోజు సాయంత్రం సమావేశమవుతుందని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.‘మేము సాయంత్రం సమావేశం అవుతున్నాం. అభ్యర్థిని ప్రకటించే హక్కు మాకు లేదు. ప్రతిపాదనల్ని ఢిల్లీకి పంపుతాం. కేంద్ర ఎన్నికల కమిటీ అక్కడ సమావేశమవుతుంది.మా సిఫార్సును ఆమోదించొచ్చు. లేదంటే తిరస్కరించొచ్చు. జాబితాలో కొత్త పేర్లను చేర్చొచ్చు’ అని చెప్పారు. 

తొలిజాబితాలో ఏడు స్థానాలకు 
కాంగ్రెస్ తొలి జాబితాలో కర్ణాటకలోని ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేకపోవడంతో కాంగ్రెస్ తొలి జాబితాలో మంత్రులు,ఎమ్మెల్యేల పేర్లను ప్రకటించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement