సందర్భం
‘కోటికి ఒకరే పుడతారు పుణ్య మూర్తులు’ అన్నారు. అలా జనించిన వారు సమాజానికి వెలుగిస్తారు. అందరి జీవితాలలో సంతోషాన్ని వెలిగిస్తారు. జనం గుండెల్లో సజీవులై ఉంటారు. అలాంటి మహామనుషులలో అతి ముఖ్యుడు డా‘‘ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన 1949 జూలై 8న ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఆయన మన మధ్య లేక పోయినా ఆయన జన్మదినాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలవారూ ఓ పండుగలా జరుపుకొంటున్నారు. ఆయన చిత్రపటానికి పాలాభిషే కాలు, పూలాభిషేకాలు ఇంకా చేస్తున్నారు అంటే ఆయన ఎంత మేలు చేశారో, ఎన్ని ప్రాణాలు నిలిపారో లెక్కేయడం కష్టం. ఈ మధ్య చంద్రబాబు సమక్షంలో ‘నేను ఇంకా జీవించి ఉండటానికి కారణం రాజశేఖరరెడ్డిగారు, ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ’ అని ఓ మహిళ ధైర్యంగా ప్రకటించింది. అందుకే ఆయన దేవుడయ్యాడు.
వైద్య విద్య పూర్తయిన తరువాత ఆస్పత్రి పెట్టి ఒక రూపాయికే వైద్యం చేశాడు. అందుకే ఆయన్ని జనం ‘రూపాయి డాక్టరు’గా పిలుచుకున్నారు. ప్రజలకు కేవలం వైద్యం అందిస్తే చాలదు, ఇంకా అనేక విషయాలలో వారికి సేవలు అందాలంటే శాసనం చేసే అధికారం ఉండాలని భావించాడు. అందుకే రాజకీయ రంగప్రవేశం చేశాడు. తన వ్యక్తిత్వం, నిజాయితీ నిలుపుకొంటూనే ముందుకు సాగాడు. ఆరుసార్లు శాసనసభ్యుడిగా, నాలుగుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక అయిన తిరుగులేని నాయకుడాయన.
పాదయాత్రలతో చరిత్ర
33 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. 1985 నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడుగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రజల కోసం చేసిన పోరాటాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును సెక్రటేరియట్ ముందు నడిరోడ్డులో నిలువరించాడు. ఆ తెగువ చూసి రాష్ట్రం ముక్కున వేలేసుకుంది. ఇతను కదా నాయకుడు అనుకుంది. రామారావు సైతం ఆంతరంగికుల ముందు రాజశేఖరరెడ్డిని మెచ్చుకున్నారట. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్ర బాబు ఆనాడు విద్యుత్ చార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ 90 మంది శాసనసభ్యులతో కలిసి ఆ రోజుల్లో నిరాహార దీక్షచేశాడు. రైతులను రక్షించడానికి వారికి ఉచిత విద్యుత్తు అందించాలన్న ఆలోచన ఆయనకు ఆనాడే వచ్చిందేమో!
రాయలసీమ ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించే పోతి రెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్ సామర్థ్యం పెంచాలని 1986లో 22 రోజులు పాదయాత్ర చేశాడు వైఎస్. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఆ కెనాల్ సామర్థ్యం పెంచాడు. పాదయాత్రలో సెక్యూరిటీ, సౌకర్యాలు, భోజనం – ఏవీ పట్టించుకునేవాడు కాదు. కొన్నిసార్లు నేరుగా పొలాల్లోకో, ఎదురుగా ఉన్న గుడిసెలోకో హఠాత్తుగా వెళ్ళి పోయేవాడు. వారి మాటలు వినేవాడు. కష్టం తెలుసుకునేవాడు. 2003లో వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర ఓ సువర్ణా ధ్యాయానికి ఆరంభం. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు 1,673 కిలోమీటర్లు 67 రోజుల పాటు నడిచి, ప్రజల మధ్య నిలిచాడు. ఆయన వెంట ఉన్న మాకు అనుక్షణం ఓ కొత్త అనుభవం. నడి ఎండలో నడుస్తూ కూడా ఆయన ఆలోచించింది తనవారి కోసం, తన ప్రజల కోసం. తాను తినడానికి ముందు భోజనం అందరికీ అందిందా అని చూసేవాడు. అందరి మధ్యలోనే పడుకునేవారు. ఏసీ గదులు ఉన్నాయని చెప్పినా వారించేవాడు. పాదయాత్రలో ఆయన పరిష్కరించిన సమస్యలపై ఓ పెద్ద పుస్తకం రాయచ్చు. పాదయాత్ర మధ్య దశలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా లెక్క చేయలేదు. నాలుగు రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి కదిలాడు. వైద్యులు వారించారు. నేనూ వైద్యుడినే అన్న విషయం మరచి పోతున్నారు అన్నాడు చిరునవ్వుతో!
పథకాలే పతకాలుగా...
2004 ఎన్నికలలో ప్రజలు ఆయనకు అఖండ మెజారిటీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ఒక స్వర్ణయుగం. ఒక విప్లవం. ఒక మార్పు, ఒక భరోసా, ఒక కదలిక. అన్ని రాష్ట్రాలు ఆరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూశాయి. ఒక మంచి మనిషి అధికారంలోకి వస్తే ఇన్ని మంచి పనులు చేయవచ్చా అని ఆశ్చర్యపోయాయి. ఉచిత కరెంటు అందింది. పేదల ఇంటి ముందుకు ఆరోగ్యశ్రీ వచ్చి కొన్ని లక్షల ప్రాణాలు నిలిచాయి. ఆయన చిత్రపటాన్ని ఇంటిలో పెట్టుకున్నారు. పేద విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందింది. లక్షలాది మంది పేద విద్యార్థులు విద్యావంతులై లక్షలు సంపాదిస్తున్నారు. ‘జలయజ్ఞం’తో రైతుల ముఖం నిండా ఆనందం. హింసావాదాన్ని వీడి ప్రజలలో కలవండి అని అభ్యర్థిస్తూ నక్సలైట్లతో చర్చలు కూడా జరిపారు. శాంతిమయ రాష్ట్రాన్ని స్వప్నించిన మహాస్వాప్నికుడు ఆయన. తిరుమల శ్రీవేంక టేశ్వర స్వామి వారి అఖండ వైభవ ప్రచారానికి అంతులేని కృషి, కార్యక్రమాలు చేసి శ్రీనివాస ప్రభువు పల్లకీ మోసి, పల్లె పల్లెకు తీసుకువెళ్ళిన హైందవ ధర్మ సేవకుడాయన. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ స్థాపకుడు. ‘కల్యాణమస్తు’ అన్న కరుణామూర్తి.
మహా విషాదం
2009 ఎన్నికలలో తిరిగి అధికారంలోకి వచ్చారు. కానీ అను కోని పరిణామం ఆయనను మనకు దూరం చేసింది. ఓ నాయకుని కోసం కొన్ని వందల మంది ఆత్మార్పణ చేసుకోవడం కనీ వినీ ఎరు గని మహావిషాదం. ఇలాంటి అద్భుత వ్యక్తి హితుడు, స్నేహితుడు, గురువు అయినందుకు నాకు ఆనందం, గర్వం. ఆయనతో గడిపిన ప్రతిక్షణమూ నాకు కొత్త పాఠం. నా తప్పులు దిద్దాడు. నా చేయి పట్టి నడిపాడు. ‘కరుణా’ అంటూ ప్రేమగా పిలిచాడు. నిత్యం పచ్చ గానూ, పచ్చిగానూ ఉంది ఆ జ్ఞాపకం. నాలాంటి కొన్ని లక్షల మందికి జీవన సౌభాగ్యం కల్పించిన ఆ మహానాయకుడు మళ్ళీ జన్మించి మన మధ్యకు రావాలని ప్రార్థిద్దాం. మదిలోని ఆయన జ్ఞాపక సజీవ చిత్ర పటానికి ఈ విధంగా అక్షర సుమాలు అర్పించు కోవడం, నా తీరని తీయని ఋణం, బంధం, బాంధవ్యం!
భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు


