రేవంత్‌ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్‌ | CM Revanth Wrote Letter To Minister Kishan Reddy | Sakshi
Sakshi News home page

రేవంత్‌ Vs కిషన్‌రెడ్డి.. బహిరంగ లేఖతో సీఎం కౌంటర్‌

Feb 28 2025 11:50 AM | Updated on Feb 28 2025 1:12 PM

CM Revanth Wrote Letter To Minister Kishan Reddy

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీ నేతల మధ్య పరస్పర విమర్శలపర్వం కొనసాగుతోంది. పలు ప్రాజెక్ట్‌ల అంశమై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికి కౌంటరిస్తూ తాజాగా సీఎం రేవంత్‌ బహిరంగ లేఖను విడుదల చేశారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం హీటెక్కింది. 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్‌ తాజాగా తొమ్మిది పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేశామో తెలియజేశారు. ఇక, సీఎం రేవంత్‌ లేఖలో.. ఆర్‌ఆర్‌ఆర్‌, మూసీ, మెట్రో ఫేజ్‌-2, హైదరాబాద్ సివరేజ్, వరంగల్ అండర్ గ్రౌండ్ సివరేజ్ కోసం ఎన్ని సార్లు కేంద్ర మంత్రులను, అధికారులను కలిసినా ఉపయోగం లేదు. మేము సిస్టం ఫాలో అయ్యాం.. కానీ, కేంద్రమే పక్కన పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితమ ప్రధాని మోదీతో సమావేశానంతరం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘హైదరాబాద్‌లో మెట్రో రెండోదశ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్‌ వద్దకు వెళ్లకుండా కిషన్‌రెడ్డే అడ్డుకున్నారు. తన మిత్రుడు కేసీఆర్‌ పదేళ్లలో చేయని పని ఇప్పుడు చేస్తే రేవంత్‌రెడ్డికి పేరొస్తుందనే అలా చేశారు. నాకు రాష్ట్ర ప్రయోజనాల కంటే పేరు ముఖ్యం కాదు. కావాలంటే అనుమతులు, నిధులు తెప్పించి ఆ పేరును కిషన్‌రెడ్డినే తెచ్చుకోమనండి. నేను కూడా ఆయన పేరే ఊరూరా ప్రచారం చేస్తా. సన్మానిస్తాం అన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన ఐదు ప్రాజెక్టులకు సహకరించాలని మోదీకి విన్నవించాం. వాటికి అనుమతులు, నిధులు తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లదే. లేకపోతే వారిద్దరూ గుజరాత్‌కో.. ఇంకో రాష్ట్రానికో వెళ్లిపోవాలి. తెలంగాణలో వారికి తిండి దండగ’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో రేవంత్‌ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డివి గాలి మాటలు. బెదిరింపు రాజకీయాలకు నేను భయపడను. నేను మెట్రోను అడ్డుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజంగా రేవంత్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఇది నిరూపించాలి. ఇలాంటి బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలను మానుకోవాలి. సీఎం స్థాయి వ్యక్తి అవగాహన లేక మాట్లాడుతున్నారు. నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ విసిరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement