
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. తాజాగా కవిత.. ఎర్రవల్లికి వెళ్లి కేసీఆర్తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ను కవిత కలవడం విశేషం. కవిత.. తన భర్త అనిల్తో కలిసి ఎర్రవల్లికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, కేసీఆర్తో కలిసి కవిత.. బీఆర్కే భవన్కు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కేటీఆర్ తనయుడు హిమాన్షు సైతం ఎర్రవల్లి ఫాంహౌస్కు చేరుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ కోసం కేసీఆర్.. ఈరోజు ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బయలుదేరనున్నారు.
ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.

బరాజ్లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు.