‘ఆప్‌’ను నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం | Bjp Uses Ed,cbi Aap Leader Saurabh Bhardwaj Slams | Sakshi
Sakshi News home page

‘ఆప్‌’ను నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం

Apr 10 2024 7:59 PM | Updated on Apr 10 2024 8:52 PM

Bjp Uses Ed,cbi Aap Leader Saurabh Bhardwaj Slams - Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి కారణంగా తమ పార్టీ నేత, మాజీ మంత్రి రాజ్‌కుమార్‌ ఆనంద్‌ రాజీనామా చేసినట్ల ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. బీజేపీ ఆప్‌ నేతలపై ఆరోపణలు చేయడం.. ఆ ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడం పరిపాటిగా మారిందని మండిపడుతోంది.   

గత ఏడాది నవంబర్‌లో రాజ్‌కుమార్ ఆనంద్ ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 23 గంటల పాటు దాడులు నిర్వహించిందని ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. అందుకు బీజేపీయే కారణమని విమర్శించారు.  

తమ పార్టీని విచ్ఛిన్నం చేయడమే అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు వెనుక బీజేపీ ఉద్దేశమని పునరుద్ఘాటించిన భరద్వాజ్..‘ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రతి మంత్రి, ఎమ్మెల్యే పరీక్షను ఎదుర్కొంటున్నారు’అని అన్నారు. ‘ఈ పోరాటంలో కొంతమంది వెనక్కి తగ్గుతారని మాకు తెలుసు. కొందరు విచ్ఛిన్నం అవుతారు. కానీ ఈ పరిస్థితులను ఎదుర్కొనే పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఉన్నారు అని భరద్వాజ్ పునరుద్ఘాటించారు. 

నవంబర్ 2023లో కస్టమ్స్ లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆనంద్ ఇంటిని సోదాలు నిర్వహించింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, స్థానిక కోర్టుకు చేసిన ఫిర్యాదులో రూ.7 కోట్లకు పైగా కస్టమ్స్ ఎగవేతకు పాల్పడినట్లు తెలిపింది. దీంతో ఈడీ ఆనంద్‌పై ఫిర్యాదు చేసింది.

తమ పార్టీకి చెందిన పలువురు నేతలతో బీజేపీ టచ్‌లో ఉందని.. క్యారెట్, స్టిక్ పద్ధతిలో వారిని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి గతంలో ఆరోపించారు. ఆమెతో పాటు మరికొంత మందిని పార్టీ సంప్రదించిందని అతిషి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అతిషిపై పరువు నష్టం దావా వేసింది. ఇదే అంశంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement