మోదీని విమర్శించే రేవంత్ ఎమర్జెన్సీపై మాట్లాడాలి: డీకే అరుణ | BJP MP DK Aruna Serious Comments On Congress And Revanth Reddy, More Details Inside | Sakshi
Sakshi News home page

మోదీని విమర్శించే రేవంత్ ఎమర్జెన్సీపై మాట్లాడాలి: డీకే అరుణ

Jun 25 2025 1:08 PM | Updated on Jun 25 2025 1:33 PM

BJP MP DK Aruna Serious On Congress And Revanth

సాక్షి, నల్లగొండ: ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు అంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. జూన్ 25 దేశ చరిత్రలో చీకటి రోజు అని అన్నారు. ప్రధాని మోదీని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి అని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు అని ఎద్దేవా చేశారు.

నల్లగొండలో బీజేపీ ఎంపీ డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ..‘ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ చేసిన అరాచకాల గురించి అందరికీ తెలియాలి. ఆర్టికల్-352ను ఇందిరా గాంధీ దుర్వినియోగం చేశారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేయాలి. ఎంతో మంది ప్రతిపక్ష నేతలను, లక్షల మందిని జైలుకు పంపించారు. కాంగ్రెస్ తన అజెండాను దేశంపై రుద్దేందుకు రాజ్యాంగ సవరణలు చేపట్టింది. ఆర్ఎస్ఎస్, జనసంఘ్, ఏబీవీపీ నేతలను జైళ్లలో వేసి హింసించారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.

విదేశాల్లో దేశం, ప్రధాని మోదీ గురించి అవహేళనగా మాట్లాడటం రాహుల్ అవివేకం. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత శక్తి‌ ఏంటో చూపించాం. ప్రధానిని విమర్శించే రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ గురించి మాట్లాడాలి. ఎన్నికల‌ ముందు అనేక హామీలను ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. స్థానిక సంస్థలకు వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు. రైతు భరోసా పేరుతో సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో కాంగ్రెస్ నేతలకే తెలియదు. రెండు ఎకరాలు ఉన్నవారికి కూడా రైతు భరోసా రాలేదు. ఫోన్ ట్యాపింగ్‌లో బీజేపీ నాయకులందరూ బాధితులే. ఫోన్ ట్యాపింగ్‌పై ఇంత వరకు ఎందుకు చర్యలు లేవు?. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు? అని ప్రశ్నించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement