
హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది.
దీనిలో భాగంగా మాట్లాడిన రాజాసింగ్.. ‘ సభలో కేసీఆర్ ఆడిన ప్రతి మాట అబద్ధం. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయిలు ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగింది. కేసీఆర్ ఫాంహౌస్ లో మంచిగా ఉన్నారు. మీరు అక్కడ ఉంటేనే మంచిది.కేసీఆర్ రాష్ట్రాన్ని మత్తుగా మార్చారు. తెలంగాణ అంటే బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారుతోనే జరుగుతుంది’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు.