
సాక్షి, హైదరాబాద్, సాక్షి, నాగర్కర్నూల్, కొత్తపల్లి (కరీంనగర్): తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని, అప్పుడే గాలిలో మేడలు కడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైన విషయాన్ని వారు సులభంగా మరిచిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అంటే టెయింటెడ్ పొలిటీషియన్స్ ఆఫ్ క్రైమ్ అండ్ కరప్షన్.. అని విమర్శించారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని సామాజిక భద్రతా పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గతంలోని లోటుపాట్లను తొలగించి మరింత మెరుగ్గా అవి అమలయ్యేలా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా సంజయ్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ధరణి, సంక్షేమ పథకాలు, పెన్షన్లు వంటి వాటిపై రాష్ట్ర ప్రజల్లో అనిశ్చితి, అయోమయం రేకెత్తించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నిమగ్నమైతే... మరోవైపు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు రద్దవుతాయంటూ సీఎం కేసీఆర్ ప్రజల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ సర్వేలోనే బీఆర్ఎస్కు 30 స్థానాలు
కేసీఆర్ నిర్వహించిన సర్వేలోనే బీఆర్ఎస్కు 30 స్థానాలకు మించి రావని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలవాలనే సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. గుంట నక్కలే గుంపులుగా వస్తాయని, బీజేపీ సింగిల్గానే పోటీ చేస్తుందని బండి స్పష్టం చేశారు.
బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఆదివారం టిఫిన్ బైటక్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ :రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళా దుస్తులపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించిన తీరు అవమానకరమన్నారు.