
కుత్బుల్లాపూర్: అధికార బీఆర్ఎస్కు చెందిన 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, తమ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో బుధవారం గాజులరామారంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర ఇంచార్జి తరున్చుగ్, బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్లు మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 30 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవరని తెలుసుకున్న కేసీఆర్... కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది అభ్యర్థులకు డబ్బులు వెచ్చించాలని భావిస్తూ ఇప్పుడే కుట్రలకు తెర లేపారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. కేసీఆర్ ఎలాగైనా రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టేందుకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
దేశం కోసం.. ధర్మం కోసం.. సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని, తెలంగాణ రాష్ట్రంలో నిజాం, రజాకార్ల పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బహిరంగ సభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు హరీష్రెడ్డి, విక్రమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.