
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై అవనిగడ్డ తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించడం లేదంటూ మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ దోపిడీని టీడీపీ నేతలు బయటపెట్టారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన బుద్ధప్రసాద్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ చల్లపల్లిలో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ వాపోయారు.
మీ వల్ల నేను గెలవలేదని ఎమ్మెల్యే మమ్మల్ని పదే పదే అవమానిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఏ చిన్న పనిమీద వెళ్లినా అధికారులు మమ్మల్ని గౌరవించేవారు. మమ్మల్ని అవమానిస్తున్న ఎమ్మెల్యేతో ఎలా కలిసి పనిచేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నించారు.
ఇసుక, మట్టిని ఎమ్మెల్యే కుటుంబం దోచుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ కార్యకర్త ఎవరైనా ట్రక్కు మట్టి సొంత పొలం నుంచి ఇంటికి తోలుకున్నా.. అధికారులను ఉసిగొల్పుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా గురించి పోస్టు పెట్టినందుకు కోడూరు మండల తెలుగు యువత నాయకుడిపై కేసు పెట్టించారని.. తక్షణమే అవనిగడ్డ నియోజవర్గానికి టీడీపీ ఇంఛార్జిని నియమించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.