సాక్షి, కృష్ణా జిల్లా: మంత్రి సుభాష్కు టీడీపీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. జిల్లా ఇంఛార్జి మంత్రి హోదాలో అవనిగడ్డ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై మంత్రి సమక్షంలో టీడీపీ కార్యకర్తలు భగ్గుమన్నారు. ప్రభుత్వంలో ఉండి కూడా గ్రామాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. రెండేళ్లుగా గ్రామాల్లో ఒక్క పని కూడా జరగడం లేదన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలంటూ మంత్రిని నిలదీశారు. త్వరలోనే అవనిగడ్డకు ఇంఛార్జ్ని నియమిస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. మంత్రి ప్రసంగానికి టీడీపీ సీనియర్ కార్యకర్తలు అడ్డుపడ్డారు. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పై టీడీపీ కార్యకర్తలు తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే తీరును మంత్రి సుభాష్ సమక్షంలో టీడీపీ కార్యకర్తలు ఎండగట్టారు. టీడీపీ నియమించిన ఇంఛార్జ్ తనకు నచ్చలేదని ఎమ్మెల్యే చెబితే మీరేం చేస్తారంటూ కార్యకర్త ప్రశ్నించారు. తనను ప్రశ్నించిన కార్యకర్తపై మంత్రి సుభాష్ అసహనం వ్యక్తం చేశారు. తాను చెప్పేది మీకు అర్థం కావడం లేదని కార్యకర్తపై మంత్రి మండిపడ్డారు. తాము ఏం చెప్పినా మీకు అర్థం కాదు... తాము చెప్పినా మీరు వినరు అంటూ మంత్రి తీరుపై టీడీపీ కార్యకర్త అసహనం వ్యక్తం చేశారు.


