
విజయవాడ, సాక్షి: భారీ వర్షాలు.. వరద బీభత్సంతో అల్లాడిపోయిన పరిస్థితులపై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కృష్ణా నదికి వరద ప్రవాహం తగ్గిపోగా.. శుక్రవారం తీరికగా అధికారులతో కలిసి మానిటరింగ్ నిర్వహించారాయన. అయితే.. వచ్చి రావడంతోనే గత ప్రభుత్వంపై నెపం నెట్టేసే ప్రయత్నం చేశారాయన.
‘‘బుడమేరును గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. సరిగా మెయింటెన్స్ చేయలేకపోయారు. బుడమేరు నిర్వహణ సరిగ్గా ఉంటే.. వరద ముప్పు తక్కువగా ఉండేది. ప్రస్తుతం వరద తగ్గుతోంది. పెద్ద ప్రమాదం తప్పింది’’ అని అన్నారాయన. అయితే సకాలంలో చర్యలు తీసుకోకపోవడం, సత్వరంగా సహాయక చర్యలు పప్రారంభించకపోవడంపై ఆయన మౌనం వహించారు.
తక్కువ టైంలో ఎఫెక్టివ్గా పని చేశాం. ఇండియన్ ఎయిర్ఫోర్స్, నేవీ సహకారంతో బాధితులకు సాయం అందిస్తున్నాం. చిన్న చిన్న ప్రాంతాలకు కూడా ఐఏఎస్లను పెట్టాం. లక్షా 72 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. నేను సాయపడాలి కానీ అదనపు భారం కాకూడదు. సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదనే నేను ఫీల్డ్లోకి రాలేదు. ఇప్పుడు.. నా వంతు సహకారంగా కోటిరూపాయలు అందిస్తున్నా అని పవన్ తెలిపారు.