ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఒకవైపు, ప్రచార వ్యూహాలు మరోవైపు ఉండే సున్నితమైన సరిహద్దు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. ఏపీలో సోషల్ మీడియా ప్రచారం పేరుతో భారీ నిధుల కేటాయింపు జరిగిందన్న అంశం రాజకీయ వర్గాల్లోనూ, నెటిజన్ల మధ్యనూ తీవ్ర చర్చకు కారణమవుతోంది.
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పబ్లిసిటీ కోసం తాజాగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం కోసం దాదాపు 40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వినియోగించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ప్రచారం కోసం ఇంత భారీ వ్యయం ఇప్పుడు అవసరమా? అనే చర్చ జోరందుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారంపై ఇప్పటికే విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. అంతేకాకుండా ప్రధాని మోదీ సూచించిన పొదుపు సూత్రాలను పాటిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు భారీ ప్రచార వ్యయంపై విపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం లేకపోలేదు.
చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి తాజాగా రెండేళ్లు పూర్తైంది. ఈ కాలంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం.. రెండూ పడకేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన కూడా ముందుకు వస్తోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా టీంలు చంద్రబాబు విషయంలో ఎంత హడావిడి చేస్తున్నదో తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ విభాగం ద్వారా ఆ పనిని ముమ్మరం చేయాలని చంద్రబాబుకు తనయుడు, మంత్రి నారా లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు దుబారా విమర్శను అంగీకరించకుండా.. డిజిటల్ యుగంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వేగంగా చేరాలంటే సోషల్ మీడియా ప్రచారం అవసరమేనని అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి.


