అనంతపురం: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ విద్యార్థి సంఘం నాయకుడు కుళ్లాయిస్వామిపై అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...ఓ విద్యార్థి సంఘంలో నాయకుడిగా ఉన్న కుళ్లాయిస్వామి అనంతపురం రూరల్ మండలానికి చెందిన యువతికి ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. అనధికారికంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవల మరో పెళ్లి చేసుకుంటానని, అడ్డొస్తే చంపేస్తానని బెదిరించాడని బాధిత యువతి ఆరోపించింది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం జిల్లా ఎస్పీ జగదీష్ కలిసి బాధితురాలు వినతిపత్రం అందజేసింది.
పోలీస్స్టేషన్లో హైడ్రామా
ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం అనంతపురం రూరల్ పోలీస్స్టేషన్కు వచ్చిన బాధితురాలు కుళ్లాయిస్వామిపై ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా కేవలం నోటీసు ఇచ్చారనే భావనతో తీవ్ర మనస్థాపానికి గురై వెంట తెచ్చుకున్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
దీంతో పోలీసులు వెంటనే ఆమెను సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఈ ఘటన అనంతరంపోలీసులు కుళ్లాయిస్వామిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడిని బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని అనంతపురం రూరల్ సీఐ శ్రీకాంత్ యాదవ్ వెల్లడించారు.


